ఒకప్పుడు ఒకే ఒక్క బాస్… దశాబ్ధాల పాటు ఆయనే సర్వస్వం. ఇప్పుడు ముగ్గురు ఐఏఎస్ అధికారులు సారథ్యం వహిస్తున్నారు. మేనేజింగ్ డైరెక్టర్గా సర్ఫరాజ్ అహ్మద్, జాయింట్ ఎండీగా శివేంద్రప్రతాప్, తాజాగా అదనపు ఎండీగా బాధ్యతలు చేపట్టిన బీ.అజిత్ రెడ్డి. ఇలా ముగ్గురు టాప్ క్లాస్ బాసులు మెట్రో భవన్లో కొలువుదీరారు. అధికారులు పెరిగారు. సమీక్షలు పెరిగాయి. కానీ ఓల్డ్ సిటీ మెట్రో పనులు మాత్రం ఒక్క అంగుళం కూడా ముందుకు కదలడం లేదు. ముగ్గురు బాసులున్నా.. పాత బస్తీకి మెట్రో భాగ్యం కలగడం లేదనే విమర్శలు ఇప్పుడు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.
సిటీబ్యూరో, జూలై 19(నమస్తే తెలంగాణ): ఎన్నోఏళ్ల నిరీక్షణ తర్వాత పాతబస్తీకి ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు 5.5కి.మీ మేర మెట్రో లైన్ నిర్మించేందుకు గతంలో పునాది పడింది. ఆ తర్వాత రూట్ మార్పులు, పొడిగింపులతో కలిపి మొత్తం 7.5 కి.మీ మేర కారిడార్ను క్లియర్ చేయాల్సి ఉంది. మెట్రో రెండో దశ ప్రణాళికల్లో భాగంగా పాతబస్తీ లైన్ విస్తరణకు సంబంధించిన తుది అనుమతుల ప్రక్రియ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వద్దే కొలిక్కిరాకుండా నిలిచింంది. రాష్ట్రంలో ఉన్నతాధికారులు ఎంతమంది ఉన్నా… కేంద్రంతో సమన్వయం చేసుకుని 7.5 కి.మీ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు, నిధులను మంజూరు చేయడంలో ఆశించిన స్థాయిలో ప్రభావం చూపడం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Metro24
సమీక్షల జోరు.. పురోగతి బేజారు
మెట్రోకు నూతన అదనపు ఎండీగా అజిత్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఉప్పల్ డిపో పర్యటనలు, ఫేజ్-1 ఆపరేషన్స్, ఫేజ్-2 ప్రణాళికలపై వరుస సమీక్షలు నిర్వహించారు. జీఎండీ శివేంద్ర ప్రతాప్ పరిపాలనపరమైన అంశాలను పర్యవేక్షిస్తున్నారు. ఎండీ సర్ఫరాజ్ అహ్మద్ హెచ్ఎండీఏ బాధ్యతలతో పాటు మెట్రోకు అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అముగ్గురు అధికారులు నిత్యం సమీక్షలు, అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారే తప్పా, కేంద్రం నుంచి సమన్వయం చేయడంలో విఫలమవతున్నారనే విమర్శలున్నాయి. పేపర్లు కదులుతున్నాయి. పవర్ పాయింట్ ప్రజేంటేషన్లు సాగుతున్నాయి. కానీ ఓల్డ్ సిటీ మెట్రోకు పట్టిన గ్రహణం మాత్రం వీడటం లేదు. కేంద్రం నుంచి అనుమతుల ప్రక్రియ ఎందుకు నత్తనడకన సాగుతోంది. దానికి అవసరమైన ల్యాండ్ అక్వైజేషన్, సాంకేతిక అడ్డంకులను తొలగించడంలో ఈ ముగ్గురు బాసుల వ్యూహం ఎందుకు ఫలితాన్ని ఇవ్వడం లేదనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
కుంటుపడుతున్న విస్తరణ..
ఒకవైపు ఐటీ కారిడార్లో కిక్కిరిసిన జనాలతో మెట్రో ప్రయాణం సాగుతున్నది. సౌకర్యవంతమైన ప్రయాణం కాస్తా రద్దీ జనాలతో నడుస్తోంది. కనీసం పెరిగిన రద్దీకి అనుగుణంగా మెట్రో సేవలను విస్తరించడంలో అధికారులు ఇప్పటివరకు చొరవ తీసుకోలేదని ప్రయాణికులు మండిపడుతున్నారు. మరోవైపు పాతబస్తీ ప్రజలు ఎంతో కాలంగా ట్రాఫిక్ నరకంలో మగ్గిపోతున్నా.. ముగ్గురు సమర్థులైన ఐఏఎస్ అధికారుల బృందం కూడా కనీసం భూసేకరణ ప్రక్రియను పూర్తిచేయలేక పోయింది. వాస్తవానికి పనులు మరింత రాకెట్ వేగంతో దూసుకుపోవాలి. కానీ ఇక్కడ పరిస్థితి రివర్స్ గేర్లో నడుస్తోంది. ఇక కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న 7.5 కి.మీ అనుమతుల ఫైలును కూడా ముందుకు తీసుకురాలేకపోయారు. రెండో దశ విస్తరణకు మొదటి దశ స్వాధీనంతో మొదలైన ఈ వ్యవహారంలో పాత బాస్ కూడా పర్యవేక్షిస్తున్నా…కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో హైదరాబాద్ మెట్రో విస్తరణ కుంటుపడుతోందనే అభిప్రాయం నగరవాసుల్లో వ్యక్తం అవుతుంది.
