హైదరాబాద్ : సీఎం కేసీఆర్ మీడియా సమావేశంపై చిల్లరగాళ్లు కాదు స్పందించాల్సింది ప్రధాని మోదీనో.. కేంద్ర మంత్రులో స్పందించాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి బీజేపీ నేతలపై ఫైర్ అయ్యారు. దమ్ముంటే ముఖ్యమంత్రి కేసీఆర్ సంధించిన ప్రశ్నలకు ప్రధాని మోదీతో లేదు అంటే కేంద్రమంత్రులతో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
మంగళవారం బీజేపీ నేత బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనను కలిసిన మీడియాతో మంత్రి మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లపై బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో చర్చకు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. చర్చకు టీఆర్ఎస్ పార్టీ సన్నద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అడిగిన దాంట్లో తప్పేముందని ఆయన సూటిగా ప్రశ్నించారు.
సంవత్సరం ప్రణాళికను కేంద్రం విడుదల చేయాలని డిమాండ్ చేయడం తప్పేలా అవుతుందని ఆయన నిలదీశారు. ఇంతకూ యాసంగిలో పండిన పంటను కొనుగోలు చేస్తారా లేదా అన్నది బీజేపీ నేతలు ఎక్కడ స్పష్టత ఇవ్వలేదని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజల భావోద్వేగమే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవేశంగా ప్రతిధ్వనించిందని అందులో తప్పు పట్టాల్సింది ఏమి లేదని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.
భాష గురించి బండి సంజయ్ మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు గా ఉన్నాయని ఆయన ఎద్దేవాచేశారు. కేంద్రవ్యవసాయశాఖ మంత్రితో పాటు రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి సైతం బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. మోదీ సర్కార్ ప్రవేశపెడుతున్న విద్యుత్ చట్టం ఎవరికి ప్రయోజనం చేకూర్చేందుకు అన్నది బట్టబయలు చేస్తామన్నారు.
మోటర్లకు మీటర్లు పెట్టాలి అన్నది కేంద్రంలో కొలువుదీరిన బీజేపీ సర్కార్ కాదా అన్నది తేల్చిచెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేసేందుకే కేంద్రం కుట్రలకు తెరలేపిందన్నారు.