హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 24(నమస్తే తెలంగాణ): వందే భారత్ రైలుకు ప్రధాని మోదీ మరోసారి పచ్చజెండా ఊపారు. ఆదివారం కాచిగూడ(హైదరాబాద్)-యశ్వంత్పూర్(బెంగళూర్), విజయవాడ-చెన్నై వయా రేణిగుంట సహా దేశవ్యాప్తంగా కొత్తగా తొమ్మిది రూట్లలో వందేభారత్ రైళ్లను మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. దీంతో దేశంలో వందే భారత్ రైళ్ల సంఖ్య 34కు చేరింది. ప్రధాని మోదీ మాట్లాడుతూ దేశంలోని ప్రతి ప్రాంతాన్ని వందే భారత్ రైలు కనెక్ట్ చేసే రోజు ఎంతో దూరం లేదని అన్నారు.
హైదరాబాద్లోని కాచిగూడ రైల్వేస్టేషన్లో జరిగిన వందేభారత్ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్కుమార్ జైన్, ఎమ్మెల్సీ ఏవిఎన్రెడ్డి, హైదరాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ లోకేష్ విష్ణోయ్, ఇతర రైల్వే అధికారులు పాల్గొన్నారు. ఈ నెల 25 నుంచి యశ్వంత్పూర్ నుంచి, 26వ తేదీ నుంచి కాచిగూడ నుంచి వందే భారత్ రాకపోకలు కొనసాగుతాయని రైల్వే అధికారులు పేర్కొన్నారు. కొత్తగా ప్రారంభమైన ఈ రైలులో ఎనిమిది కోచ్లు ఉన్నాయి. ఒక ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్, ఏడు ఏసీ ఛైర్కార్ కోచ్లు ఉన్నాయి. ఇందులో 530 మంది ప్రయాణించవచ్చని అధికారులు తెలిపారు.