హైదరాబాద్లోని హస్తినాపురానికి చెందిన లక్ష్మమ్మ (పేరు మార్చాం) క్యాన్సర్ బారినపడ్డారు. గత ఏడాదిన్నరగా మందులు వాడుతున్నారు. అంచెలంచెలుగా డోసు పెంచుతుండటంతో ప్రస్తుతం నెలకు రూ.40 వేల వరకు మందులకు ఖర్చు అవుతున్నది. వైద్య ఖర్చుల కారణంగా అప్పుల పాలవుతున్న ఆ కుటుంబానికి ఇప్పుడు ఔషధ ధరల పెంపు పిడుగుపాటుగా మారింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తాజాగా పెంచిన ధరల ప్రకారం.. ఈ కుటుంబంపై నెలకు రూ.5 వేలకు పైగా అదనపు భారం పడనున్నది.
సికింద్రాబాద్కు చెందిన రామయ్యకు బీపీ, షుగర్. ఇతని భార్యదీ అదే పరిస్థితి. తనకున్న ఇద్దరు కుమారుల్లో ఒకరికి బీపీ సమస్య ఉన్నది. ఈ కుటుంబం మందుల కోసమే నెలకు రూ.4 వేల వరకు ఖర్చు చేస్తున్నది. మందుల ధరలను పెంచడం తమ కుటుంబానికి రోకటిపోటులా మారిందని రామయ్య కుటుంబం ఆవేదన చెందుతున్నది. ఇలాంటి కుటుంబాలు హైదరాబాద్లో కోకొల్లలు.
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 29 (నమస్తే తెలంగాణ): అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మానసిక ప్రశాంతతే సగం మందు అంటారు. కానీ, మందుల ధరలు మానసిక ప్రశాంతత లేకుండా చేస్తున్నాయి. గతంలో ఎన్నడూలేని విధంగా ఔషధ ధరలు ఒకేసారి 12.12% పెరగడంతో ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు లబోదిబోమంటున్నారు. సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై ధరల పెంపు తీవ్ర ప్రభావం చూపనున్నది. ఇప్పటికే ఔషధ కంపెనీలు ఇష్టానుసారం ధరలను నిర్ణయిస్తుండగా, కేంద్రం నిర్ణయం ప్రజలకు మోయలేని భారంగా పరిణమిస్తున్నది.
ఏప్రిల్ 1 నుంచి ఔషధ ధరల మోత
క్యాన్సర్, డయాబెటిస్, కార్డియోవాస్క్యూలర్ వంటి వ్యాధులతో గ్రేటర్ హైదరాబాద్లో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వీటి ఔషధాల ధరలు కూడా చాలా ఎక్కువే. బీపీ, షుగర్ వంటి జబ్బులు సర్వ సాధారణమే అయిన నేపథ్యంలో ప్రతి కుటుంబానికి మందుబిళ్లల కొనుగోలు తప్పనిసరి ఖర్చుగా మారింది. పెయిన్ కిల్లర్లు, యాంటిబయాటిక్స్, యాంటీ ఇన్ఫెక్టివ్స్, హృద్రోగ చికిత్సలో వినియోగించే మందులతో సహా 800 రకాల అత్యవసర మందుల ధరలను 12.12% మేర పెంచడం ఇదే మొదటిసారని వ్యాపారవర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే అన్ని నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటిన నేపథ్యంలో ఔషధాల ధరలను కూడా భారీగా పెంచడంతో ప్రజల ఆర్థిక కష్టాలు మరింత పెరుగుతాయని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
నెలకు రూ.10 కోట్ల భారం
కరోనా మహమ్మారి నుంచి ఇంకా పూర్తిగా తేరుకోలేని ప్రజలను ఔషధాల ధరలు ఉక్కిరిబిక్కిరి చేయనున్నాయి. గ్రేటర్ హైదరాబాద్లో 1.20 కోట్ల జనాభా ఉండగా దాదాపు 30 లక్షల కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇందులో 80లక్షల నుంచి 90 లక్షల మంది వివిధ రుగ్మతలతో బాధపడుతున్నట్టు వివిధ సంస్థలు నిర్వహించిన పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ప్రతి కుటుంబం నెలకు సగటున రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు మందులకే వెచ్చిస్తున్నది. ఈ లెక్కన ఔషధాల ధరల పెంపుతో ఆయా కుటుంబాలపై ఎంతలేదన్నా నెలకు రూ.400 నుంచి 500 వరకు అదనపు భారం పడనున్నది. నెలకు ప్రజలపై ఔషధ భారం రూ.10 కోట్ల వరకు ఉంటుందని వ్యాపార వర్గాలు చెప్తున్నాయి.
ఔషధ ధరలను పెంచడం దారుణం
వివిధ రుగ్మతలతో బాధపడుతున్నవారికి ధరల పెంపు పెనుభారమే. ఇప్పటికే అన్నిరకాల నిత్యావసర వస్తువుల ధరలను పెంచి నడ్డివిరిచిన కేంద్రం ఔషధాలను కూడా వదలక పోవడం శోచనీయం. తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్యం దిశగా చర్యలు చేపడుతుంటే కేంద్రం ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుతున్నది.
– సీహెచ్ ఆనంద్కుమార్గౌడ్, తెలంగాణ కెమిస్ట్ అండ్ డ్రగ్టిస్ట్ అసోసియేషన్ సభ్యుడు
ధరల పెంపుపై పునరాలోచించాలి
ఔషధాల ధరల పెంపుతో సామాన్యుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇక మెడికల్ షాపుల నిర్వహణ సైతం కష్టంగా మారుతుంది. ధరల పెంపుపై కేంద్రం పునరాలోచించాలి.
– విజయ్, మెడికల్ షాపు నిర్వాహకుడు
మందుల కోసం అప్పులు చేయాల్సిందే
పదేండ్లుగా డయాబెటిస్తో ఇబ్బంది పడుతున్నాను. నిత్యం మందులు వేసుకుంటేనే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. కేంద్రం మందుల ధరలను అమాంతం పెంచడం సరైందికాదు. పొట్ట నింపుకునేందుకే ఇబ్బందులు పడుతున్నం. మందుల కోసం మాలాంటి పేదలం ఏమి చేయాలో పాలుపోవడం లేదు.
– కే ఆండాలు, డయాబెటిస్ బాధితురాలు
పేద రోగులపై తీవ్ర ప్రభావం
60 ఏండ్లు దాటిన వారిలో 90% మంది బీపీ, షుగర్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఈ లెక్కన మన దగ్గర ప్రతి ఇంటిలో కనీసం ఒక పేషెంట్ ఉంటున్నారు. ఈ మధ్య కాలంలో యువతలో చాలామంది డయాబెటిక్, కిడ్నీ, గుండె జబ్బులతో బాధపడుతున్నారు. ఇలాంటి వారందరిపై ఔషధాల ధరలు తీరని ఆర్థిక భారంగా మారే అవకాశాలుంటాయి.
-డాక్టర్ రఘురామ్రావు, ప్రముఖ ఫార్మకాలజీ శాస్త్రవేత్త
ఇంత పెరుగుదల చూడలేదు
సాధారణంగా ఔషధాలపై వార్షికంగా ధరలు పెరగడం సహజం. గతంలో ఔషధాల ధరల పెరుగుదల ఎప్పుడూ మూడు నాలుగు శాతానికి మించలేదు. కానీ, ఈ ఏప్రిల్ 1 నుంచి 12.12% పెరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ ఈ స్థాయి పెరుగుదల చూడలేదు. నిరుపేద రోగులు చికిత్స, ఔషధాల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మందులు కొనే పరిస్థితి లేక ప్రాణాల మీదకూ తెచ్చుకునే ప్రమాదం లేకపోలేదు. దీనిపై కేంద్రం పునరాలోచించడం మంచిది.
– డాక్టర్ ఆకుల సంజయ్రెడ్డి, తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ మాజీ చైర్మన్