నమస్తే తెలంగాణ న్యూస్నెట్వర్క్, డిసెంబర్ 28: తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెం దిన సమ్మక్క సారలమ్మ వంటి జాతరలు సమాజంలో విలువలు పెంపొందింపజేయడానికి దోహదపడతాయని రాష్ట్రపతి ద్రౌపదీముర్ము పేర్కొన్నారు. రామప్ప ఆలయంలో శిల్పసంపద అద్భుతమని కొనియాడారు. శీతకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి బుధవారం రాష్ట్రంలో పలు కార్యక్రమా ల్లో పాల్గొన్నారు.
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంతోపాటు ములుగు రామ ప్ప దేవాలయంలో కేంద్ర పర్యాటకశాఖ ఆధ్వర్యంలోని ప్రసాద్ పథకాన్ని ప్రారంభించారు. భద్రాచలంలోని వీరభద్ర ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమ్మక్క సారలమ్మ పూజారుల సమ్మేళనంలో పాల్గొన్నారు. అంతకుముందు వర్చువల్ విధానంలో ఆసిఫాబాద్, మహబూబాబాద్లో ప్రభుత్వం నిర్మించిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో రాష్ట్రపతి మాట్లాడుతూ.. రాష్ట్రపతి హోదాలో తెలంగాణలో తొ లిసారిగా పర్యటిస్తున్నానని, ఇక్కడి ప్రముఖ్య పుణ్యక్షేత్రాల్లో దేశ సంక్షేమం కోసం ప్రార్థించే అవకాశం లభించిందని చెప్పారు. ప్రసాద్ పథ కం ఆలయాల జీర్ణోద్ధరణ, అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుందని అన్నారు. తెలంగాణ వనవాసీ పరిషత్ గిరిజన సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు పాటుపడటం హర్షణీయమని పేర్కొన్నారు. ఏకలవ్య మాడల్ స్కూల్స్ ద్వారా ఆదివాసీ పిల్లలకు మెరుగైన విద్య అందుతున్నదని ప్రశంసించారు.
ఆదివాసీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నదని మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదివాసీల అభ్యున్నతికి కట్టుబడి అహర్నిశలు పనిచేస్తున్నారని కొనియాడారు. హైదరాబాద్లో రూ.25 కోట్లతో సేవాలాల్ బంజారా భవన్, కుమ్రంభీం ఆదివాసీ భవన్ నిర్మించారని గు ర్తుచేశారు. ప్రభుత్వ గురుకులాల్లో చదివిన 1,200 మంది దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వైద్య, ఇంజినీరింగ్ కళాశాలల్లో సీట్లు పొందారని వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 3,146 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిందని చెప్పారు. భద్రాద్రి వంటి ఏజెన్సీ జిల్లాకు మెడికల్ కాలేజీని మంజూరు చేసిందని తెలిపారు. గర్భిణుల ఆరోగ్య సంరక్షణ కోసం ఆరోగ్యలక్ష్మి పథకం, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తున్నామని, తాజాగా న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ ప్రారంభించామని చెప్పారు. సమావేశంలో గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి అజయ్కుమార్ పాల్గొన్నారు.
ఉదయం 11 గంటలకు హెలికాప్టర్లో సారపాక బీపీఎల్ స్కూల్ హెలిప్యాడ్కు చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, రాష్ట్ర మంత్రులు సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్కుమార్, భద్రాద్రి కలెక్టర్ అనుదీప్, ఎస్పీ వినీత్ పుష్పగుచ్ఛాలు అందించి ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి కాన్వాయ్ ద్వారా భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ రాష్ట్రపతికి మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఎంపీ వద్దిరాజు రవిచం ద్ర, ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, పొదెం వీర య్య, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య స్వాగతం పలికారు.
మేళతాళాల నడుమ ఆలయ అధికారులు, అ ర్చకులు రాష్ట్రపతికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ముందుగా రాష్ట్రపతి ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద పూజలు చేశారు. ప్రధానార్చకులు ఆమెకు ఆలయ విశిష్టతను వివరించారు. అనంతరం రూ.41.38 కోట్లతో కేంద్ర పర్యాటకశాఖ చేపట్టనున్న ప్రసాద్ పథకాన్ని ప్రారంభించి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆలయంలో శ్రీసీతారామచంద్రస్వామిని దర్శించుకున్నారు. అనంతరం రాష్ట్రపతి.. గవర్నర్ తమిళిసై, కిషన్రెడ్డి, సత్యవతిరాథోడ్తో కలిసి మధ్యాహ్నం 2:55 గంటలకు ములుగు జిల్లా పాలంపేటలోని రామప్ప దేవాలయాన్ని సందర్శించారు.
అక్కడ జిల్లా యంత్రాంగం తరఫున మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, శ్రీనివాస్గౌడ్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, కలెక్టర్ కృష్ణఆదిత్య ఘనస్వాగతం పలికారు. రామప్ప ప్రధాన గేటు నుంచి ఆలయం వరకు రాష్ట్రపతి కాలినడకన చేరుకున్నారు. ఆలయ సంప్రదాయాల ప్రకారం అర్చకులు పూర్ణకుంభంతో స్వాగ తం పలికారు. రుద్రేశ్వరస్వామికి రాష్ట్రపతి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు రాష్ట్రపతితోపాటు గవర్నర్, కేంద్ర, రాష్ట్ర మంత్రులను శాలువాలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. రామప్ప ఆలయంలోని ఉన్న పురాతన శిల్పాలను ఆమె ఆసక్తిగా తిలకించారు.
శిల్పసంపద బాగున్నదని కొనియాడారు. రామప్పకు యునెస్కో గుర్తింపు రావడానికి కారణమైన ఈ శిల్పాలకు ఉన్న ప్రత్యేకతను కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ కన్వీనర్ పాం డురంగారావు వివరించారు. ఆలయ ఆవరణలో వేదికపైకి చేరుకొని ప్రసాద్ పథకం కింద రామప్ప దేవాలయ అభివృద్ధి, కామేశ్వరాలయ పునరుద్ధరణ పనులు, భక్తుల వసతికల్పన, మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.62 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు రాష్ట్రపతి శంకుప్థాపన చేశారు. అనంతరం సాంస్కృతిక ప్రదర్శనలను వీక్షించారు. సాయంత్రం 4:20 గంటలకు రాష్ట్రపతికి హెలిప్యాడ్ వద్ద మంత్రులు దయాకర్రావు, శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మె ల్యే అనసూయ, జడ్పీ చైర్మన్ జగదీశ్వర్, కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు వీడ్కోలు పలకగా హైదరాబాద్కు బయలుదేరారు.
రాష్ట్రపతి ద్రౌపదీముర్మును స్కైరూట్ స్టార్టప్ వ్యవస్థాపకులు ప్రసాద్ చందన, డాకా నాగభరత్ బుధవారం హైదరాబాద్లో కలిశారు. స్కైరూట్ సంస్థ రూపొందించి ఇటీవల అంతరిక్షంలోకి ప్రయోగించిన విక్రమ్-ఎస్ రాకెట్ గురించి, భవిష్యత్తు ప్రణాళికలను గురించి రాష్ట్రపతికి వివరించారు.
రాష్ట్రంలోని ఆదిమ తెగల కళాకారులు, గిరిజన సంక్షేమశాఖ ఉన్నతాధికారులకు రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ఆహ్వానం పలికారు. కొలాం, చెంచు, తోటి, కొండరెడ్డి ఈ నాలుగు ఆదిమతెగల్లోని ప్రముఖులు, కళాకారులు గురువారం ఉదయం 9 గంటలకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో కలవాలని సూచించినట్టు రాష్ట్రపతిభవన్ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తూ, ఇతర ఉన్నతాధికారుల బృందం ఈ మేరకు ఏర్పాట్లు చేసింది. నాలుగు ఆదిమ తెగలకు చెందిన ప్రతినిధులు, అధికారులు మొత్తం దాదాపు 60 మంది రాష్ట్రపతిని కలిసే అవకాశం ఉన్నట్టు సమాచారం.
భద్రాచలం దేవస్థానం కల్యాణ మండపం ఎదుట గిరిజనులు నిర్వహించిన రేలాటను రాష్ట్రపతి వీక్షించారు. కళాకారులతో కలిసి ఆడి పాడారు. ఏకలవ్య మాడల్ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రారంభించిన తర్వాత ‘నమస్కారం’ అంటూ తెలుగులో మాట్లాడి, ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రముఖ కవి దాశరథి రచించిన ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ కవితా పంక్తులను ఉటంకించారు. తెలుగు భాష అంటే తనకు ఇష్టమని చెప్పారు.
అశ్వారావుపేట, డిసెంబర్ 28: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం మొద్దులమడక గ్రామానికి చెందిన విద్యార్థిని రేణుకకు రాష్ట్రపతి పర్యటనలో అరుదైన గౌరవం దక్కింది. హైదరాబాద్లోని గురుకులంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న రేణుక.. గురువారం హైదరాబాద్లోని రాజ్భవన్లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతికి తెలంగాణలో ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాల గురించి ఆంగ్లంలో వివరించనున్నది. అరుదైన అవకాశాన్ని దక్కించుకున్న రేణుకను ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం గురుకులాల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తుండటంతో రేణుక వంటి మెరికలు తయారవుతున్నారని హర్షం వ్యక్తం చేశారు.