హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి, విస్తృత ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. ఏర్పాట్లపై ఆమె బుధవారం సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ఈ నెల 18న హైదరాబాద్కు వస్తారని, ఐదు రోజుల విడిది అనంతరం 23న తిరుగు ప్రయాణం అవుతారని చెప్పారు. వైద్యారోగ్య, రోడ్లు భవనాలు, మున్సిపల్, విద్యుత్తు తదితర శాఖలు కూడా బ్లూ బుక్ ప్రకారం ఫూల్ ప్రూఫ్ ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఆదేశించారు. సమీక్షలో డీజీపీ రవిగుప్తా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్శర్మ, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, సీనియర్ పోలీసు అధికారులు, ఇతర శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.