హైదరాబాద్/ మేడ్చల్ కలెక్టరేట్/ యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): పురాతన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని తెలంగాణ ప్రభుత్వం అద్భుతంగా పునర్నిర్మించిందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రశంసించారు. ఆమె శుక్రవారం లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 9.50 గంటలకు హెలికాప్టర్లో రాష్ట్రపతి యాదగిరిగుట్టకు చేరుకొన్నారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ రాష్ట్రపతి వెంట రాగా, కొండ కింద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద రాష్ట్ర మంత్రులు జగదీశ్రెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత స్వాగతం పలికారు. ఆలయంలో అర్చకులు పూర్ణకుంభంతో రాష్ట్రపతికి స్వాగతం పలికారు. ముందుగా ప్రధాన ఆలయంలో ధ్వజస్తంభానికి మొక్కి, గర్భాలయంలో స్వయంభువులను దర్శించుకొన్నారు.
ఆలయ ప్రాశస్త్యం గురించి ఈవో గీతారెడ్డి వివరించారు. ఈ సందర్భంగా పురాతన ఆలయ పునర్నిర్మాణంపై రాష్ట్రపతి ప్రశంసలు కురిపించారు. అనంతరం ముఖమంటపంలో రాష్ట్రపతి, ఆమె కుమార్తె ఇతిశ్రీ ముర్ము, గవర్నర్కు వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చారు. లక్ష్మీ నరసింహస్వామి వారి జ్ఞాపికను అందజేశారు. అద్దాల మండపం వద్ద ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని రాష్ట్రపతి తిలకించారు. ఆ తర్వాత ప్రత్యేకంగా చేసిన తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఉత్తర రాజగోపురం ముందు రాష్ట్రపతితో మంత్రులు, అధికారులు, ఆలయ సిబ్బంది ఫొటోలు దిగారు. సుమారు గంటపాటు ఆలయంలో ఉన్న రాష్ట్రపతి తిరిగి హెలికాప్టర్లో హైదరాబాద్కు బయల్దేరి వెళ్లారు. రాష్ట్రపతి పర్యటన కోసం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. కార్యక్రమంలో దేవాదాయ కమిషనర్ అనిల్ కుమార్, కలెక్టర్ పమేలా సత్పతి, రాచకొండ సీపీ మహేశ్ భాగవత్, డీసీపీ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ ఎంవీ భూపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన రాష్ట్రపతి పర్యటన
శీతాకాల విడిదికోసం తెలంగాణకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఐదు రోజుల పర్యటన ముగించుకొని శుక్రవారం తిరిగి ఢిల్లీ వెళ్లారు. హకీంపేటలోని ఎయిర్ఫోర్స్ స్టేషన్ నుంచి ప్రత్యేక విమానంలో దేశ రాజధానికి ప్రయాణమయ్యారు. రాష్ట్రపతికి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా వీడ్కోలు పలికింది. మంత్రి సత్యవతి రాథోడ్ తెలంగాణ సంప్రదాయం ప్రకారం నూతన పట్టు వస్ర్తాలు, జ్ఞాపికను అందజేశారు. అనంతరం అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి రాష్ట్రపతికి వెండి వీణ జ్ఞాపికను బహూకరించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు అందించాల్సిందిగా నూతన పట్టు వస్ర్తాలను, జ్ఞాపికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంత్రి సత్యవతి రాథోడ్కు అందించారు. వీడ్కోలు కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హాజరు కావాల్సి ఉన్నది. అయితే ఆయన వియ్యంకుడు హరినాథరావు గురువారం మరణించటంతో శుక్రవారం రాష్ట్రపతి ఇచ్చిన విందుకు, వీడ్కోలు కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు. ఈ విషయాన్ని రాష్ట్రపతికి సైతం తెలియజేసినట్టు సమాచారం. శీతాకాల విడిది తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని రాష్ట్రపతి పేర్కొన్నట్టు మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు.
శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 26న హైదరాబాద్కు వచ్చారు. ఆమెకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఘన స్వాగతం పలికారు. మంత్రివర్గం మొత్తం దగ్గరుండి ఆమెను ఆహ్వానించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రతిపక్ష నేతలు, పలువురు ప్రజాప్రతినిధులు రాష్ట్రపతికి పుష్పగుచ్ఛాలు అందించారు. ఐదు రోజుల పర్యటనలో రాష్ట్రపతి తీరిక లేకుండా గడిపారు. 26న ఏపీలోని శ్రీశైలం వెళ్లి మల్లికార్జున స్వామిని దర్శించుకొన్నారు. తిరిగి వచ్చిన తర్వాత బొల్లారంలోని యుద్ధస్మారకం వద్ద నివాళులర్పించారు. 27న నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ విద్యా సంస్థలను సందర్శించారు. 28న భద్రాచలం వెళ్లి సీతారామచంద్ర స్వామిని దర్శించుకొన్నారు.
అనంతరం వరంగల్ జిల్లాలోని ప్రఖ్యాత రామప్ప ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహించారు. 29న నారాయణమ్మ కాలేజీని, ముచ్చింతల్లోని రామానుజాచార్య విగ్రహాన్ని సందర్శించారు. శుక్రవారం ఉదయం ఆమె యాదాద్రి ఆలయానికి వెళ్లి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొన్నారు. మధ్యాహ్నం హైదరాబాద్కు చేరుకున్న తర్వాత రాష్ట్రపతి నిలయంలో విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, కేంద్రమంత్రి కిషన్రెడ్డి, రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీలు నామా నాగేశ్వర్రావు, దీవకొండ దామోదర్రావు, వద్దిరాజు రవిచంద్ర, శ్రీనివాస్రెడ్డి, బీబీపాటిల్, రేవంత్రెడ్డి, బండి సంజయ్, ఏపీ నుంచి పవన్కళాణ్ తదితరులు హాజరయ్యారు.