హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం హైదరాబాద్కు విచ్చేశారు. సోమవారం రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్బాబు, ధనసరి అనసూయ, సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, ఇతర ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం బేగంపేట నుంచి నేరుగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకున్నారు. ఐదు రోజులపాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ద్రౌపది ముర్ము బస చేయనున్నారు. ఇందుకోసం అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. మంగళవారం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ను రాష్ట్రపతి సందర్శించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బొల్లారం నుంచి బేగంపేట రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు.