హైదరాబాద్: శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరికాసేపట్లో హైదరాబాద్ రానున్నారు. ఉదయం 10.40 గంటలకు వాయుసేన ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. విమానాశ్రయంలో రాష్ట్రపతికి.. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రి సత్యవతి రాథోడ్ స్వాగతం పలుకనున్నారు. అటునుంచి ప్రత్యేక హెలికాప్టర్లో శ్రీశైలం వెళ్తారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం 4.15 గంటలకు శ్రీశైలం నుంచి హకీంపేటకు చేరుకుంటారు.
రాష్ట్రపతి హోదాలో తొలిసారిగా రాష్ట్రానికి వస్తున్న ద్రౌపది ముర్ముకు హకీంపేటలో సీఎం కేసీఆర్ ఘనంగా స్వాగతం పలుకనున్నారు. రాష్ట్ర మంత్రులందరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు. ఐదు రోజులపాటు బొల్లారంలో రాష్ట్రపతి నిలయంలో ద్రౌపది ముర్ము బస చేయనున్నారు. పర్యటనలో భాగంగా భద్రాచలం, రామప్ప, యాదాద్రి ఆలయాలను సందర్శిస్తారు.