Predator Drone | ఒక వస్తువు ఖరీదు పది రూపాయలు. కానీ నూరు రూపాయలిస్తేనే అమ్ముతానని వ్యాపారి అంటే ఎవరైనా ఏం చేస్తారు? ‘పోపోవోయ్.. మరో దగ్గర కొనుక్కొంటాం’ అంటారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు రూటే సపరేటు. ఎక్కువ ధర చెప్పినప్పటికీ.. మరొకరు దొరకనట్టు ఆ వస్తువే కావాలని వారిదగ్గరే కొంటున్నది. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల సొమ్మును అంగట్లో పప్పు బెల్లంలా పంచిపెడుతున్నది. అమెరికాతో భారత్ ఇటీవల చేసుకొన్న ‘31 ఎంక్యూ9బీ ప్రిడేటర్ డ్రోన్ డీల్ ’ కోవలోకి వస్తుంది.
(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల అమెరికాలో పర్యటించిన సందర్భంగా అమెరికాతో భారత్ ఒక రక్షణ ఒప్పందం కుదుర్చుకున్నది. కానీ మీడియా.. ప్రధాని ఎక్కడికి వెళ్లారు? ఎవరెవర్ని కలిశారు? ఏయే విందుల్లో పాల్గొన్నారు? ఇంకేం మాట్లాడారు? అనే అంశాలను పూసగుచ్చినట్టు వివరించాయి. కానీ అమెరికాతో భారత్ కుదుర్చుకున్న రక్షణ ఒప్పందం పెద్ద గోల్మాల్ వ్యవహారంగా కనిపిస్తున్నదన్న విషయాన్ని ఒకటీ అరా మినహా ఏ ప్రధాన మీడియా సంస్థ కూడా కవర్ చేయలేదు. ఇప్పుడు ఆ ఒప్పందంపై ప్రధాన విపక్ష పార్టీలు అధికార బీజేపీని నిలదీస్తున్నాయి.
ఏమిటీ డీల్?
దేశ ప్రాదేశిక సమగ్రతను కాపాడటంలో భాగంగా అమెరికాకు చెందిన రక్షణరంగ ఉత్పత్తుల సంస్థ జనరల్ అటామిక్స్ (జీఏ) అనే ప్రైవేటు కంపెనీతో భారత్ ఓ ఒప్పందాన్ని కుదుర్చుకొన్నది. ఈ ఒప్పందం ప్రకారం ఎంక్యూ9బీ రకానికి చెందిన 31 ప్రిడేటర్ డ్రోన్లను జీఏ భారత్కు సరఫరా చేస్తుంది. ఇందుకోసం 3.072 బిలియన్ డాలర్లు (రూ. 25,200 కోట్లు) జీఏకు భారత్ చెల్లించను న్నది. అమెరికాతో ఉన్న దౌత్య సంబంధాల్లో భాగంగా ఈ డీల్ కుదుర్చుకొన్నట్టు, రెండు ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందంగా ఈ డీల్ను అభివర్ణించారు. భారత్ కొనుగోలు చేయనున్న 31 డ్రోన్ విమానాల్లో సముద్రాలపై నిఘా కోసం 15 నేవీకి, గగనతలం నుంచి భూతలంపై నిఘా కోసం 16 ఆర్మీకి అందించనున్నారు.
నాలుగురెట్లు ఎక్కువ
జీఏ సరఫరా చేయనున్న 31 ప్రిడేటర్ డ్రోన్లకు భారత్ రూ. 25,200 కోట్లను చెల్లించనుంది. అంటే ఒక్కో డ్రోన్ విలువ రూ. 813 కోట్లు. అంతర్జాతీయ విపణిలో ఇదే మాడల్ ప్రిడేటర్ డ్రోన్ ఖరీదు రూ. 150 కోట్లు మాత్రమే ఉన్నది. అంటే ఒక్కో డ్రోన్ కోసం భారత్ నాలుగైదు రెట్లు ఎక్కువ మొత్తాన్ని చెల్లించడానికి సిద్ధమైనట్టు తెలుస్తున్నది. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో కేంద్రం నష్టనివారణ చర్యలకు పూనుకొన్నది. ఇంకా డీల్ పూర్తిస్థాయిలో ఫైనల్ కాలేదని, రేటు గురించి మాట్లాడాల్సి ఉన్నదని యూటర్న్ తీసుకొన్నది. అయితే, డీల్ ఇప్పటికే పూర్తయినట్టు రాయిటర్స్ సహా ప్రధాన పత్రికలు ప్రచురించడం గమనార్హం.
‘డౌట్ఫుల్’గా జీఏ ట్రాక్ రికార్డ్
ప్రభుత్వం ద్వారా ఒప్పందం కుదుర్చుకొన్న వారికి ఒకరకంగా, డైరెక్ట్గా కాంట్రాక్ట్ ఇచ్చిన వారికి మరో రకంగా, డిమాండ్ లేని సమయంలో ఇంకోవిధంగా ఒప్పందాలను చక్కబెట్టడం జీఏకు అలవాటు. కంపెనీ గత రికార్డులను పరిశీలిస్తే ఈ విషయాలు స్పష్టమవుతాయి. అమెరికా ప్రభుత్వం కోసం ఎంక్యూ9బీ డ్రోన్ ఒక్కింటికి జీఏ రూ. 450 కోట్లు చొప్పున వసూలు చేస్తుండగా, 2016లో కేవలం రూ. 102 కోట్లకే ఒక్కో డ్రోన్ను అమ్మేందుకు బ్రిటన్తో డీల్ కుదుర్చుకొన్నది. జర్మనీకి కూడా రూ. 139 కోట్లకు అమ్మడానికి సిద్ధమైంది. అయితే ఆస్ట్రేలియాకు మాత్రం రూ.1,066 కోట్లను కోట్ చేసింది. ధర ఆమోదయోగ్యంగా లేదన్న కారణంతో ఆస్ట్రేలియా ఈ డీల్ నుంచి తప్పుకొన్నది.
డీల్ మర్మం ఇదేనా?!
అమెరికాలో రిపబ్లికన్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీల మధ్యే ప్రధాన పోటీ ఉంటుంది. ఎనర్జీ సెక్టార్లో వేళ్లూనుకొన్న జీఏకు ఇరు పార్టీలతో మంచి సంబంధాలు ఉన్నాయి. అందుకే, జీఏ నుంచి ప్రిడేటర్ డ్రోన్లను కొనుగోలు చేయాలంటూ మాజీ అధ్యక్షుడు ట్రంప్ గతంలో భారత్పై ఒత్తిడి తీసుకొచ్చారు. ఇప్పుడు అధికారంలో ఉన్న బైడెన్ ప్రభుత్వం కూడా జీఏ పక్షాన భారత్పై ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తున్నది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాలను ఆశించే బీజేపీ సర్కారు అమెరికా ఒత్తిళ్లకు తలొంచిందని, ఇందులో భాగంగానే ఈ డీల్కు ఒప్పుకున్నదని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
వద్దన్నా వినరే?!
తమకు ఇప్పటికిప్పుడు 31 ప్రిడేటర్ డ్రోన్లు అవసరం లేదని, 18 డ్రోన్లను కొనుగోలు చేయాలని ఆర్మీ గత ఏప్రిల్లో కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. అమెరికా నుంచి డ్రోన్ల కొనుగోలుపై పునరాలోచించాలని కూడా గతంలో ఓసారి సూచించింది. అయినప్పటికీ, ఇవన్నీ పట్టించుకోని కేంద్రం.. ఈ డీల్ విషయంలో ఏకపక్షంగా ముందుకే వెళ్తున్నది. డ్రోన్లను సరఫరా చేయడంతో పాటు నిర్ణీత వ్యవధి వరకు వాటి మెయింటెనెన్స్ అందిస్తామని జీఏ పేర్కొన్నది. కానీ డ్రోన్లకు సంబంధించిన సాంకేతిక సమాచారాన్ని (నాలెడ్జ్ ట్రాన్స్ఫర్) మాత్రం ఇచ్చేది లేదని తెగేసి చెప్పింది. ఇది భారత భద్రతకు ముప్పేనని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.
ఏఈ లెక్క ఇది:
ఒక్కో ప్రిడేటర్ డ్రోన్ ఖరీదు.. ఏ దేశానికి ఎంతంటే?
భారత్-రూ.813 కోట్లు
అమెరికా-రూ.450 కోట్లు
యూకే-రూ.102 కోట్లు
జర్మనీ-రూ.139 కోట్లు