హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని రోడ్లు అద్దంలా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. హైదరాబాద్ లో శుక్రవారం పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు, ఇంజినీర్లతో నిర్వహించిన వర్క్ షాప్ లో అధికారులకు దిశానిర్దేశం చేశారు.
‘ దేశానికి రోల్ మోడల్ గా నిలిచిన తెలంగాణ లో ప్రజలు రోడ్లమీద ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే రోడ్ల మరమ్మతులు, నిర్వహణ ఎప్పటికప్పుడు చేపట్టాలి. పంచాయతీ రాజ్ శాఖ పునర్వవస్థీకరణ, అదనపు నిధులకు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. డిసెంబర్ 6వ తేదీ నాటికి కొత్త ఎస్.ఈ ఆఫీసుల ఏర్పాటు. 15వ తేదీ నాటికి రోడ్ల మరమ్మతుల టెండర్లు పూర్తి కావాలని’ అన్నారు.ఈ ఏడాది రూ. 1500 కోట్ల బడ్జెట్ ఉందని, దీనికి రెట్టింపుగా రూ. 3వేల కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
వరదనీటితో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు, నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వాలని వెల్లడించారు. రోడ్ల నిర్మాణంలో అటవీ భూముల సమస్యను గుర్తించి తగిన ప్రతిపాదనలు రూపొందించాలని చెప్పారు. రోడ్ల నిర్మాణాల్లో నాణ్యత పెంపు కోసం విదేశాల్లో అధ్యయనం చేయాలని తెలిపారు. ముఖ్యమంత్రి ఆలోచనలను పక్కాగా అమలు చేస్తే భవిష్యత్ లో పంచాయతీ రూపు రేఖలు మారి శాఖ మరింత బలోపేతం అవుతుందన్నారు.
శాఖ పునర్వ్యవస్థీకరణ వేగవంతానికి ముగ్గురు ఉన్నతాధికారులతో కమిటీ వేసుకోవాలని సూచించారు. సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ సెక్రటరీ సందీప్ సుల్తానీయా, ఇంజీనీర్ ఇన్ చీఫ్ సంజీవరావు, చీఫ్ ఇంజినీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, సూపరింటెండెంట్ ఇంజినీర్లు, అధికారులు పాల్గొన్నారు.