చేర్యాల/ కొమురవెల్లి, జూలై 26: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ సభ రసాభాసగా మారింది. ప్రారంభోత్సవ సభకు హాజరైన కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు రఘునందన్రావు, చామల కిరణ్కుమార్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తదితరులకు వేదికపై రైల్వే అధికారులు బొకేలు అందించి శాలువాలు కప్పి సన్మానించారు. ఇదే సమయంలో వేదికపై కూర్చున్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి పేరును రైల్వే అధికారులు పిలవకపోవడం, సభకు హాజరుకాని పలువురు ఎమ్మెల్సీల పేరును వేదికపై పిలవడంపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్టేజీ వైపునకు దూసుకువెళ్లేందుకు యత్నించారు.

జై పల్లా, జై తెలంగాణ, జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. దీనికి ప్రతిగా బీజేపీ కార్యకర్తలు కొందరు జై భారత్ అంటూ నినాదాలు చేశారు. బీజేపీ పెద్దలు రైల్వే అధికారులను మందలించడంతో తిరిగి వారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి వద్దకు వెళ్లి బొకే ఇచ్చి శాలువా కప్పి సన్మానించారు. కావాలనే బీజేపీ పెద్దలు తమ ఎమ్మెల్యేను అవమానించారని బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు కొనసాగిస్తుండడంతో పోలీసులు వారి వద్దకు వచ్చి శాంతింపజేసేందుకు నానా తంటాలు పడ్డారు. సభలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడటం ప్రారంభించగానే బీఆర్ఎస్ శ్రేణులు జై కేసీఆర్, జై పల్లా నినాదాలు చేసి శాంతించారు. కొమురవెల్లి సర్పంచ్ గొల్లపల్లి పద్మాఆంజనేయులును సైతం రైల్వే అధికారులు మర్చిపోవడంతో ఆమె సైతం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రొటోకాల్ విస్మరించడం సరికాదని ఆమె పేర్కొన్నారు.