హైదరాబాద్ : తనపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకునేందుకు సిద్ధమని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. భూ కబ్జా ఆరోపణలపై మంత్రి మీడియా సమావేశం ద్వారా మాట్లాడుతూ వివరణ ఇచ్చారు. 1986 నుంచి తాను హేచరీస్ పరిశ్రమలో ఉన్నట్లు తెలిపారు. పౌల్ట్రీకి ల్యాండ్ ఎక్కువగా కావాలి. విస్తరణ కోసం పరిశ్రమల శాఖకు లేఖ రాశా. కెనరా బ్యాంక్ ద్వారా వంద కోట్ల రుణాలు తీసుకున్నాం.
అది వ్యవసాయ భూమి కాదు. రైతులు స్వచ్ఛందంగా సరెండర్ చేస్తే ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ద్వారా ఇవ్వొచ్చని చెప్పారు. ఒక ఎకరం కూడా నా స్వాధీనంలో లేదు. నా మొత్తం చరిత్ర మీద విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నా. భూములు కోల్పోయినా పర్వాలేదు. ఆత్మ గౌరవాన్ని అమ్ముకోను. సీఎస్, విజిలెన్స్ విచారణతో పాటు సిట్టింగ్ జడ్జితో కూడా విచారణ చేయాలి. నా ఆత్మగౌరవం కంటే పదవి గొప్పది కాదు. తనపై ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి స్పష్టం చేశారు.