కరీంనగర్, మార్చి 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల విషయంలో యువతీ యువకులకు రాష్ట్ర ప్రభుత్వంపై ఏమాత్రం విశ్వాసం సడలలేదు. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా.. ఎన్ని అసత్య ఆరోపణలు చేస్తున్నా ఉద్యోగార్థులు వారి మాయలో పడటం లేదు. టీఎస్పీఎస్సీ పరీక్షల లీకేజీ వ్యవహారాన్ని ప్రభుత్వానికి అంటగడుతూ..గత కొద్దిరోజులుగా బీజేపీ, కాంగ్రెస్ నానా యాగీ చేస్తున్నా అభ్యర్థులు మాత్రం వాస్తవాలను గుర్తించి ప్రిపేరేషన్ కొనసాగిస్తున్నారు. కనీసం అటువైపుగా ఆలోచన కూడా చేయడంలేదు.
ప్రభుత్వంపై సడలని విశ్వాసంతో ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్ర గ్రంథాలయానికే రోజుకు 800 నుంచి వెయ్యి మంది అభ్యర్థులు ప్రిపరేషన్కు రావడమే దీనికి నిదర్శనం. ప్రశ్నపత్రాల లీకేజీకి ముందు ఎలా ప్రిపరేషన్ కొనసాగించారో.. అంతే చిత్తశుద్ధితో ముందుకుసాగుతున్నారు. అలాగే, కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్లో రోజుకు 200మందికి పైగా అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారు. దీంతో గ్రంథాలయాలు, స్టడీ సర్కిల్ కేంద్రాలు ఎప్పటిలాగానే కిక్కిరిసిపోతున్నాయి.
అభ్యర్థులను రోడ్డుపైకి లాగేందుకు కుట్రలు
టీఎస్పీఎస్సీ పరీక్షల లీకేజీ వ్యవహారాన్ని తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా తీసుకొన్నది. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దోషులను పట్టుకొనేందుకు నిర్విరామంగా పని చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో దోషులెంతటి వారైనా సరే.. విడిచిపెట్టే ప్రశ్నేలేదని మంత్రి కేటీఆర్ ఇప్పటికే తేల్చి చెప్పగా.. సిట్ కూడా ఆదే రీతిలో దూకుడుగా ముందుకు వెళ్తున్నది. లీకేజీ వ్యవహారాన్ని సీరియస్గా పరిగణిస్తున్న రాష్ట్ర సర్కారు ఆ దిశగా ముందుకు వెళ్తుంటే.. కాంగ్రెస్, బీజీపీ జీర్ణించుకోలేకపోతున్నాయి.
ఇందులో భాగంగానే.. ‘యువకుల్లారా.. పుస్తకాలు వీడండి.. మాతో కలిసి రండి.. ఉద్యమిద్దాం..’ అంటూ ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెచ్చగొడుతున్న తీరు తెలిసిందే. జరుగబోయే పరీక్షల ద్వారా ఉద్యోగాలే రావంటూ పక్కదారి పట్టించేందుకు ఆయనతోపాటు ఆ పార్టీ నాయకులు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే కోణంలో.. కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన పరీక్షలన్నింటిలోనూ లీకేజీలున్నాయంటూ ఒకసారి.. ఈ పరీక్షల లీకేజీకి మంత్రి కేటీఆర్ పేషీకి సంబంధం ఉందని మరోసారి.. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో గ్రూప్-1లో వంద మంది అభ్యర్థులకు వందకుపైగా మార్కులు వచ్చాయని ఇంకోసారి..
అదే నిమిషంలో మాట మార్చి పది మందికి వంద మార్కులు వచ్చాయంటూ.. రకరకాలుగా అసత్య ఆరోపణలు చేస్తున్నారు. తాము ఎన్ని చెప్పినా.. పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న అభ్యర్థులు రోడ్డుపైకి రావడం లేదన్న కసి, కక్ష ఆ రెండు పార్టీ ల్లో స్పష్టంగా కనిపిస్తున్నది. ఇదిలా ఉంటే.. జోనల్ వ్యవస్థ తెచ్చి బీఆర్ఎస్ సర్కారు స్థానికతకు పెద్దపీట వేసిందని, స్థానికులకే ఉద్యోగాలు దక్కేలా చేసిందని ఉద్యోగార్థులు సంతో షం వ్యక్తంచేస్తున్నారు. నిరుద్యోగులందరికీ న్యాయం జరిగేలా తెలంగాణ సర్కారు భారీగా నోటిఫికేషన్లు ఇస్తున్నదని, ఒకరిద్దరు చేసిన తప్పువల్ల ప్రశ్నపత్రాలు లీకయ్యాయని, అయినా తెలంగాణ సర్కారు వేగంగా స్పం దించి సరైన నిర్ణయం తీసుకొన్నదని పేర్కొంటున్నారు. రాజకీయాలను పట్టించుకోకుండా సీరియస్గా ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు.
నిరాశకు లోనుకావద్దు
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష అర్హత సాధించా. మెయిన్కు సిద్ధమవుతున్న నేపథ్యంలో పేపర్ లీకేజీ ఘటన బాధించిన మాట వాస్తవమే. అయితే, ప్రతిభకు ఎప్పుడూ స్థానం ఉంటుందని నమ్ముతున్నా. కష్టపడి చదువుకొన్న వాళ్లకే ఉద్యోగాలు రావాలి. లీకులు అయినప్పుడు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి. దానిని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తే.. కష్టపడే వారికి అన్యాయం జరుగుతుంది. నా దృష్టిలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం ముమ్మాటికీ సముచితమైంది. లీకేజీ ఘటనతో నిరుద్యోగ యువత ఎలాంటి కుంగుబాటుకు లోనుకావద్దు. కష్టపడి చదివి విజయం సాధించాలి.
– వీ శిరీష, కరీంనగర్
ప్రభుత్వానిది సరైన నిర్ణయం
గ్రూప్-1 పరీక్షను రద్దుచేయడం సముచితమైన నిర్ణయం. లీకేజీ కారణంగా అనర్హులు ఉద్యోగాలు సాధించే అవకాశం ఉంది. కష్టపడి చదువుకొన్న వారికి అన్యాయం జరుగుతుంది. విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దానిని కప్పిపుచ్చే ప్రయత్నం చేయకుండా.. పరీక్ష రద్దుకు నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయం. నియామక బోర్డులో ఒకరిద్దరు చేసిన తప్పుల కారణంగా వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ఇబ్బందుల పాలుకాకుండా ప్రభుత్వం జాగ్రత్త పడింది. ఉద్యోగార్థులు ప్రతిపక్షాల మాయలో పడకుండా మరో మూడు నుంచి నాలుగు నెలలపాటు పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి.
– పీ స్రవంతి, గ్రూప్-1 అభ్యర్థి, పెద్దపల్లి
రాజకీయాలను పట్టించుకోవద్దు
నేను పలు పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్నా. ప్రశ్నపత్రాలను లీక్ చేసిన నిందితులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి. ఎవరూ డిమాండ్ చేయకముందే ప్రభుత్వమే దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేసి.. ప్రస్తుతం తీసుకొంటున్న చర్యలు సంతృప్తిగా ఉన్నాయి. ఒకరిద్దరి నిర్వాకంతో వేలాది మంది నిరుద్యోగులు, యువత ఇబ్బందులు పడకుండా తెలంగాణ సర్కారు ముందస్తుగా చర్యలు తీసుకుంటున్న తీరు బాగుంది. ప్రభుత్వం వరుసగా ఇస్తున్న నోటిఫికేషన్లతో నిరుద్యోగులమంతా ఆనందంగా ఉన్నాం. సీరియస్గా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నం. అందరూ బయట రాజకీయాలను పట్టించుకోకుండాకష్టపడి చదివి, ఉద్యోగం సాధించాలి.
– భూక్య తిరుమల, గర్జనపల్లి, సిరిసిల్ల