హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ) : పోలీస్ ఉద్యోగాల భర్తీకి పార్ట్-2 దరఖాస్తు గడువు ముగిసింది. ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల ప్రిలిమ్స్లో అర్హత సాధించిన 91% మంది అభ్యర్థులు దరఖాస్తు చేసినట్టు టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. ఫిజికల్ ఈవెంట్స్కు అర్హత సాధించిన 5,07,890 మందిలో 4,63,970 మంది దరఖాస్తు చేశారని వివరించారు.
తప్పులు దొర్లినా చింత వద్దు..
ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగార్థులు పార్ట్-2 దరఖాస్తును నింపే సమయంలో పొరపాట్లు దొర్లినా బాధపడాల్సిన పనిలేదని బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు. పార్ట్-2లో తప్పులు సరిచేసుకొనేందుకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం పార్ట్-2 దరఖాస్తు పూర్తి చేసిన వారందరికీ ఫిజికల్ ఈవెంట్స్ ముగిశాక, సర్టిఫికెట్ వెరిఫికేషన్కు ముందు ఎడిట్ ఆప్షన్ ఇస్తామన్నారు.
త్వరలోనే ఫిజికల్ ఈవెంట్స్
ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల ఫిజికల్ ఈవెంట్స్(ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్)లను త్వరలోనే నిర్వహిస్తామని బోర్డు అధికారులు తెలిపారు. మొత్తం 25 పనిదినాల్లో ఈ ప్రక్రియ ముగించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. అతి త్వరలోనే ఫిజికల్ ఈవెంట్స్ అడ్మిట్కార్డులు జారీ చేస్తామని పేర్కొన్నారు.