వనపర్తి, మే 13 (నమస్తే తెలంగాణ): ‘బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన బండి సాయి భగీరథ్ను వెంటనే అరెస్టు చేయాలి. బాలికపై అనేక దఫాలు లైంగికదాడికి పాల్పడ్డాడని తెలిసిన తర్వాత కూడా నిందితుడికి నోటీసు ఇవ్వాల్సిన అవసరం ఉందా? అదికూడా తండ్రి బండి సంజయ్ ఉన్నప్పటికీ భగీరథ్ మేనమామ సీహెచ్ వంశీకృష్ణకు నోటీసు ఇచ్చి పోలీసుస్టేషన్కు తీసుకురావాలనడం దుర్మార్గం. రేవంత్, బండి సంజయ్ చీకటి దోస్తానాతో పోక్సో కేసు బలహీనపడింది’ అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ధ్వజమెత్తారు.
బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి నిరంజన్రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 8న పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్కు బాలిక తల్లి వెళ్లి ఫిర్యాదు చేసిందని తెలిపారు. అయినా ఇప్పటి వరకు ఆ కేసులో ఎలాంటి పురోగతి లేదన్నారు. ఇటు రాష్ట్ర సీఎం, హోం శాఖ మంత్రిగా రేవంత్ కొనసాగుతుండగా.. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ పనిచేస్తున్నారని చెప్పారు.
వీరిద్దరి పరిధిలోనే పోలీసు వ్యవస్థ పని చేస్తున్నదని వెల్లడించారు. లైంగికదాడి ఘటనపై బీఆర్ఎస్తోపాటు పలు ప్రజాసంఘాలు పోరాటం చేయడంతో ప్రభుత్వంలో చలనం వచ్చిందని తెలిపారు. నిందితుడికి ప్రభుత్వ యంత్రాంగం ఎలా వంత పాడుతుందో ప్రజలు గమనించాలన్నారు. సంజయ్ ఇటీవల హనుమాన్ జయంతిలో తనకు అడ్డొచ్చిన వారి సంగతి చూస్తా? అంటూ బహిరంగంగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ హెచ్చరికలతో ప్రసంగాలు చేస్తుంటే అధికార యంత్రాంగం ఏం చేస్తున్నదని నిలదీశారు. మీడియాను సంజయ్ గుప్పిట్లో పెట్టుకుని కొడుకును కాపాడే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.