హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ సహకారంతో రూ. 100 కోట్లతో జిల్లాకో ఎకో టూరిజం పార్కును అభివృద్ధి చేస్తామని అటవీ అభివృద్ధి కార్పొరేషన్ (టీఎస్ఎఫ్డీసీ) చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో దాదాపు 30 లక్షల మంది ఉపాధి పొందుతున్నారని, వారికోసం స్వచ్ఛమైన పార్కులు, వాకింగ్ ట్రాక్లు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ సహకారంతో టీఎస్ఎఫ్డీసీ ముందుకు సాగుతున్నట్టు చెప్పారు. కార్పొరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం చిలుకూరు మృగవని రిసార్ట్స్లో ‘ప్రకృతి పర్యాటకం’(ఎకో టూరిజం)పై రెండు రోజుల సదస్సును ఆయన ప్రారంభించారు.
అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ‘దక్కన్ ఉడ్ అండ్ ట్రయల్స్ లోగో’ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణను వచ్చే రెండుమూడేండ్లలో ఎకో టూరిజంలో దేశంలోనే అగ్రగామిగా నిలబెడతామని పేర్కొన్నారు. ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమం ఇతర రాష్ర్టాలకు కూడా ఆదర్శంగా నిలుస్తున్నదని, దీనివల్ల రాష్ట్రంలో 7.7శాతం పచ్చదనం పెరిగినట్టు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదికలు వెల్లడించినట్టు తెలిపారు. ఎకో టూరిజం అభివృద్ధితో స్థానికులకు జీవనోపాధి లభిస్తుందని వివరించారు. పర్యాటకంలో తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపే ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నట్టు టీఎస్ఎఫ్డీసీ వైస్ చైర్మన్, ఎండీ డాక్టర్ జీ చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. సదస్సులో హరితహారం పీసీసీఎఫ్ సువర్ణ, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ క్లితిజ, సీసీఎఫ్ ప్రొడక్షన్ రామలింగం, జూపార్కు డైరెక్టర్ ప్రసాద్, క్యూరేటర్ సునీల్ తదితరులు పాల్గొన్నారు.