జయశంకర్ భూపాలపల్లి/కుమ్రంభీం ఆసిఫాబాద్ (నమస్తే తెలంగాణ)/ కోటపల్లి, ఏప్రిల్ 12: ప్రాణహిత పుష్కరాలకు వేళైంది. బుధవారం నుంచి ఈ నెల 24వ తేదీ వరకు 12 రోజులపాటు నిర్వహించనున్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత మొదటిసారి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కౌటాల మండలం తుమ్మిడిహెట్టి, మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి మండలం అర్జునగుట్ట, వేమనపల్లి మండల కేంద్రానికి సమీపంలో ప్రాణహిత పుష్కరాలకు అధికారులు ఏర్పాట్లుచేశారు.
తెలంగాణలోనే పుట్టి ఇక్కడే ముగిసే జీవనది ప్రాణహిత. గోదావరి నదికి ప్రాణహిత ప్రధాన ఉపనది. కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా తుమ్మిడిహెట్టికి పైభాగంలో పెన్గంగ, వార్ధా నదుల కలయికతో ప్రాణహిత ఏర్పడుతుంది. తుమ్మిడిహెట్టి నుంచి ప్రాణహిత ప్రయాణం మొదలై కాళేశ్వరం వరకు 113 కిలోమీటర్లు ప్రవహిస్తున్నది. కాళేశ్వరం దగ్గర గోదావరిలో ప్రాణహిత, సరస్వతి నదులతో కలిసి త్రివేణి సంగమంగా ఏర్పడుతుంది. అవతలి వైపు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రాణహిత పుష్కరాలకు ఏర్పాట్లు చేసింది. ప్రాణహిత నది ఎక్కువగా తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దులో ప్రవహిస్తున్నది.
ఉమ్మడి రాష్ట్రంలో 2010లో తుమ్మిడిహెట్టి నుంచి కాళేశ్వరం వరకు పుష్కరాలు నిర్వహించారు. బృహస్పతి మీనరాశిలోకి ప్రవేశించిన సమయంలో చైత్రశుద్ధ ద్వాదశి బుధవారం నదికి పుష్కరాలు ప్రారంభమై చైత్ర బహుళ అష్టమి 24వ తేదీన ముగుస్తాయని పండితులు పేర్కొంటున్నారు. ఈ పుష్కరాల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, మొక్కులు తీర్చుకోనున్నారు. పితృదేవతలకు పిండ ప్రదానాలు, వారి పేరిట దానాలు చేస్తుంటారు. వరంగల్ నుంచి కాళేశ్వరం వరకు సుమారు 200 బస్సులను నడుపనున్నట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. అదేవిధంగా కాళేశ్వరం నుంచి పుష్కరఘాట్ వరకు 10 మినీ బస్సుల ద్వారా భక్తులకు ఉచిత ప్రయాణం కల్పించనున్నారు.