న్యూఢిల్లీ : ప్రజాకవి కాళోజీ 108వ జయంతి వేడుకలు న్యూఢిల్లీ తెలంగాణ భవన్లోని అంబేద్కర్ ఆడిటోరియంలో ప్రజాకవి కాళోజీ నారాయణ రావు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఢిల్లీలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కె.ఎం. సాహ్ని ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరంకాళోజీ చిత్ర పటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కె.ఎం సాహ్ని మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సమరయోధుడిగా, సామాజిక ఉద్యమకారునిగా, కవిగా తెలంగాణ సమాజానికి కాళోజీ చేసిన సేవలు గొప్పవని కొనియాడారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డా. గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ.. అన్యాయం ఎక్కడ జరిగినా.. దానికి వ్యతిరేకంగా గళమెత్తే గొంతుల్లో నుంచి కాళోజీ గొంతు గర్జనగా వినిపించిందని, అసమానతలకు, దోపిడీకి, నిరాదరణకు గురవుతున్న వారిలో కాళోజీ కలం చైతన్యాన్ని నింపిందని అన్నారు.
తెలంగాణ భాషకు, సాహిత్యానికి కాళోజీ చేసిన కృషిని గౌరవిస్తూ, కాళోజీ జయంతిని “తెలంగాణ భాషా దినోత్సవం” గా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేషారు. ప్రజా జీవితాన్ని ప్రభావితం చేసిన ఆయన సమగ్ర మూర్తిమత్వాన్ని, వ్యక్తిత్వాన్ని ఆకళింపు చేసుకొని ముందుకు నడవడమే మనం ఆయనకు మనమిచ్చే ఘనమైన నివాళి అని తెలిపారు.