కొడిమ్యాల, మార్చి 10: కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ చేపట్టిన ప్రజాహిత యాత్రలో ఉద్రిక్తత నెలకొన్నది. ఆదివారం జగిత్యాల జిల్లా మల్యాల, కొడిమ్యాల మండలాల్లో యాత్ర కొనసాగింది. రాత్రి కొడిమ్యాల మండల కేంద్రంలోని బస్టాండ్ నుంచి బైపాస్ మీదుగా అంగడి బజార్ వరకు యాత్ర చేపట్టారు. యాత్ర బైపాస్ రోడ్డులోని కాంగ్రెస్ కార్యకర్తకు చెందిన చికెన్ సెంటర్ ముం దు నుంచి వెళ్తుండగా.. గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వడంతో యాత్రలోని ప్రజల మీద పడ్డాయి. దీంతో చికెన్ సెంటర్ నిర్వహకులే రాళ్లు రువ్వారని బీజేపీ నాయకులు ఎదురు దాడికి దిగారు. చికెన్ సెంటర్ను ధ్వంసం చేశారు.
ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తీవ్రమై న గొడవ జరగడంతో మల్యాల సీఐ నీలం రవి, కొడిమ్యాల ఎస్సై సందీప్ తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని చెదరగొట్టారు. దీంతో గొడవ సద్దుమణిగింది. కాగా.. బండి సంజయ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడు నెలలు దాటినా ప్రజలకు చేసింది శూన్యమని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాగా.. బండి సంజయ్ ప్రజాహిత పాదయాత్ర కారణంగా నాచుపల్లి నుంచి గోవిందారం వెళ్లే ఓ అంబులెన్స్ దాదాపు 40 నిమిషాల పాటు చిక్కుకుపోయింది. అంబులెన్స్లో అనారోగ్యం తో బాధపడుతున్న ఓ రోగి ఇబ్బందులు పడ్డాడు.