సిద్దిపేట, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీఆర్ఎస్ ఎన్నికల ప్రచార ప్రారంభ వేదికకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ముస్తాబవుతున్నది. ఆదివారం నిర్వహించే ప్రజా ఆశీర్వాద బహిరంగ సభకు స్థానిక ఎమ్మెల్యే సతీశ్కుమార్ నేతృత్వంలో పార్టీ శ్రేణులు ఏర్పాట్లుచేస్తున్నాయి. సాయంత్రం 4 గంటలకు హెలికాప్టర్లో సీఎం కేసీఆర్ సభాస్థలికి చేరుకొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు.. మూడు రోజులుగా ఎమ్మెల్యే సతీశ్కుమార్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్తో కలిసి పార్టీ కార్యకర్తల సమావేశాలు నిర్వహించి సభ విజయవంతానికి దిశానిర్దేశం చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి సభకు సుమారుగా లక్ష మంది తరలివచ్చేలా ఏర్పాట్లు చేశారు. హుస్నాబాద్లోని కరీంనగర్ రహదారిలో సబ్స్టేషన్ సమీపంలోని మైదానంలో 100 మంది కూర్చునేలా ఉత్తర దిశగా స్టేజీ ఏర్పాటు చేశారు. మహిళలు, వీఐపీలకు ప్రత్యేక గ్యాలరీలు, సభా ప్రాంగణ సమీపంలోనే హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. సభాస్థలిని శనివారం సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఆరు సెక్టార్లుగా పోలీసులు పటిష్ట బందోబస్తు పెట్టారు. పార్కింగ్ జోన్లు ఏర్పాటు చేశారు.
సభాస్థలిని పరిశీలించిన వినోద్, సతీశ్
హుస్నాబాద్లో ఆదివారం నిర్వహించే సభ ఏర్పాట్లను శనివారం సాయంత్రం బోయినపల్లి వినోద్కుమార్, మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు, స్థానిక ఎమ్మెల్యే సతీశ్కుమార్, జడ్పీ వైస్చైర్మన్, రాజిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు వేలేటి రాధాకృష్ణ శర్మ తదితరులు పరిశీలించారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపడుతున్నట్టు నిర్వాహకులు తెలిపారు.
మూడోసారి గెలుపు తథ్యం: వినోద్కుమార్
తెలంగాణను ఇన్ని విధాలుగా అభివృద్ధి చేసిన కేసీఆర్ను మూడోసారి సీఎంగా చేసేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ చెప్పారు. హుస్నాబాద్లో ఆదివారం నిర్వహించే తొలి ప్రజా ఆశీర్వాదసభకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నదని తెలిపారు. లక్ష మందితో సభను విజయవంతం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు శనివారం ఆయన మీడికు వెల్లడించారు.