ఆత్మకూరు(ఎం): ప్రతి పల్లె అభివృద్ధి చెంది పచ్చదనంతో పరిశుభ్రంగా ఉండాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతితో మండలంలోని ఉప్పలపహడ్ గ్రామం నేడు ప్రగతి పథంలో ముందుకు సాగుతుంది. గ్రామంలో 1300ల మంది జనాభా ఉండగా 540 మంది ఓటర్లు, 168 ఇండ్లు ఉన్నాయి. కాగా గ్రామ ప్రజలందరి అవసరాల కోసం ప్రభుత్వం గ్రామంలో 12 లక్షల 60వేలతో వైకుంఠధామం, రూ.2 లక్షల 50వేలతో కంపోస్ట్ షెడ్ నిర్మాణం, రూ.1లక్ష 50వేలతో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసింది.
పచ్చదనంతో పరిశుభ్రంగా గ్రామం
హరితహారంతో పాటు పల్లె ప్రగతిలో భాగంగా గ్రామంలోని ఇంటింటికీ 600ల మొక్కలు పంపిణీ చేయగా ప్రధాన వీధుల వెంట 2వేల మొక్కలను నాటి సంరక్షించడంతో అవి నేడు వేపుగా పెరిగి పచ్చదనంతో కళకళకలాడుతున్నాయి. ఎకరం స్థలంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనంలో వివిధ రకాలకు చెందిన 2వేల మొక్కలను నాటగా ఏపుగా పెరిగి ఆహ్లదాన్ని కలిగిస్తున్నాయి. అదేవిధంగా ప్రతిరోజూ గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ద్వారా ఇంటింటికీ తిరిగి తడి, పొడి చెత్తను సేకరించి కంపోస్ట్ షెడ్లో వేయడంతో పాటు వీధులతో పాటు మురుగు కాలువలను శుభ్ర పర్చడంతో గ్రామం నేడు ఎటు చూసిన పచ్చదనంతో పరిశుభ్రంగా కనబడుతుంది.
పల్లె ప్రగతితో అభివృద్ధి పనులు చేపట్టాం
ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతిలో భాగంగా గ్రామ ప్రజలందరి అవసరాల కోసం గ్రామంలో రూ.16 లక్షల 60వేలతో వైకుంఠదామం, కంపోస్ట్ షెడ్ నిర్మాణం, పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేశాం. పాత ఇండ్లను కూడా పూడ్చివేసి చదును చేయడంతో గ్రామం పరిశుభ్రంగా మారి మంచిగా కనబడుతుంది. ప్రభుత్వ విప్ గొంగిడి సునీతారెడ్డి సహకారంతో గ్రామ ప్రజలందరి అవసరాల కోసం మినీ ఫంక్షన్హాల్ నిర్మాణం కోసం కృషి చేస్తాం.