హైదరాబాద్, మార్చి 25(నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం రైతులపాలిట శాపంగా మారింది. ఫలితంగా వచ్చే వానకాలం సీజన్ నుంచి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (ప్రధానమంత్రి పంటల బీమా పథకం) అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి. కేంద్రం అనుమతించినప్పటికీ ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎన్నికల కమిషన్ అనుమతి లభించే అవకాశం లేదని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఎంపీ ఎన్నికల షెడ్యూల్కు చాలా రోజుల ముందే పథకాన్ని అమలు చేయాలని భావించిన ప్రభుత్వం తక్షణమే ప్రక్రియ ప్రారంభించినట్లయితే ఇప్పుడు కోడ్ ప్రభావం ఉండేది కాదని, ఈ విషయంలో ఇటు ప్రభుత్వం, అటు వ్యవసాయ అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
క్లస్టర్ల వారీగా ప్రణాళికలు
రాష్ట్రంలో గతంలో అమలు చేసిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజననే తిరిగి కొనసాగించాలని ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. రైతుకు అనుకూలంగా లేదన్న భావనతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2020లో ఈ పథకం నుంచి బయటకు వచ్చింది. అయితే, ఏదో ఒక పంటల బీమా పథకం ఉండటమే మేలన్న ఉద్దేశంతో పాత పథకాన్నే అమలు చేయాలని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన విధంగానే క్లస్టర్ల వారీగా కొనసాగించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఆహార ధాన్యాల పంటలకు 2 శాతం, పత్తి, మిర్చి సహా ఇతర వాణిజ్య, వాతావరణ ఆధారిత పంటలకు 5 శాతం ప్రీమియాన్ని రైతుల నుంచి వసూలు చేయాలని నిర్ణయించారు. అయితే, వివిధ జిల్లాలు, అకడి వాతావరణ పరిస్థితులను బట్టి ప్రీమియం మారే అవకాశమున్నది. రైతు వాటా ప్రీమియాన్ని సైతం ప్రభుత్వమే చెల్లిస్తుందని ఇప్పటికే పలువురు మంత్రులు ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రంలోని రైతులంతా ఈ పథకంలోకి రానున్నారు. ఇందుకోసం కోసం జిల్లా, రాష్ట్రస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయనున్నారు.