సిరిసిల్ల రూరల్, మార్చి 7: సిరిసిల్ల నేత కార్మికులు, అనుబంధ రంగ కార్మికులు సర్కార్పై కన్నెర్రజేశారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలోని సిరిసిల్ల-సిద్దిపేట రహదారిపై సీఐటీయూ నాయకులతో కలిసి నిరసన చేపట్టారు. ప్లకార్డులను ప్రదర్శించి, రాస్తారోకో చేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ పవర్లూం వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కోడం రమణ మాట్లాడుతూ.. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో పడిందని, కార్మికులు పనిలేక ఆకలితో పస్తులుండే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్రెడ్డి వెంటనే స్పందించి, బతుకమ్మ చీరలు, ప్రభుత్వ ఆర్డర్లు కేటాయించి అందరికి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు.