సూర్యాపేట టౌన్, జనవరి 13 : అతి తక్కువ సమయంలో ఎవరూ ఊహించని రీతిలో తెలంగాణను అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్తోనే యావత్ దేశం అభివృద్ధి చెందుతుందనే నమ్మకం అన్ని రాష్ర్టాల ప్రజల్లో ఉన్నదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. ఈ నెల 18న ఖమ్మం జిల్లాలో జరుగనున్న బీఆర్ఎస్ ఆవిర్భావ సభ విజయవంతానికి శుక్రవారం సూర్యాపేటలో పార్టీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ నమ్మక ద్రోహం చేయడమే కాకుండా.. పాలన అందించడంలో విఫలం చెందిన ప్రధానిగా మోదీ సరికొత్త రికార్డు సృష్టించారని అన్నారు.
నల్లధనం తీసుకొచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో డబ్బులు వేస్తానని ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఉన్న ఉద్యోగాలు ఊడబీకి, నిరుద్యోగాన్ని పెంచారని మండిపడ్డారు. 25 ఏండ్లుగా అధికారంలో ఉన్న గుజరాత్ రాష్ట్రం చీకట్లలో మగ్గుతున్నదని.. బీఆర్ఎస్ అధికారం చేపట్టిన ఐదేండ్లలోనే తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని తెలిపారు.
నిరంతర విద్యుత్తు, పుష్కలంగా తాగు, సాగు నీరు, రైతుబంధు, రైతు బీమా, దళితబంధు వంటి అనేక సంక్షేమ పథకాలతోపాటు చీకట్లను చీల్చే వెలుగులు దేశమంతా నిండాలంటే సీఎం కేసీఆర్ నాయకత్వం కావాలని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. సమావేశంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, నియోజకవర్గంలోని పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.