హైదరాబాద్: కరెంటు ఎప్పుడు పోతుందో (Power Cut) తెలియని పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నది. రెండు గంటలు విద్యుత్ కోతలు విధిస్తామని ప్రభుత్వం అధికారికంగానే ప్రకటించింది. ఈ నేపథ్యంలో గత తొమ్మిదిన్నరేండ్లలో ఎన్నడూ లేనివిధంగా తొలిసారిగా అసెంబ్లీలో (Assembly) పవర్ యూనిట్ జనరేటర్ను (Power Generator) ఏర్పాటు చేశారు. కరెంటు ఎప్పుడు పోతుందోనని తెలియక ముందస్తుగా ఏర్పాటు చేసినట్లు తెలుస్తున్నది. దీంతో ఇదేనా కాంగ్రెస్ మార్క్ మార్పు అని దానిని చూసినవారు చర్చించుకుంటున్నారు. కరెంటు ఉండబోదని కాంగ్రెస్ సర్కారు సైతం విశ్వసిస్తున్నదని ప్రభుత్వంపై సెటైర్లు వేస్తున్నారు.
ఈ నెల 7న బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీమంత్రి హరీశ్ రావు ఓ సభలో మాట్లాడుతుండగా కరెంటు పోయిన విషయం తెలిసిందే. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో జనగామ నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో గత బుధవారం నిర్వహించిన సమావేశంలో హరీశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్న కరెంట్ పరిస్థితి గురించి వివరిస్తున్నారు.. సరిగ్గా అదేసమయంలో విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. దీంతో మార్పు వచ్చిందంటూ సెటైర్ వేశారు. జనరేటర్ ఆన్ చేయడంతో ఆయన మళ్లీ తన ప్రసంగం కొనసాగించారు. కాగా, ఆ సమయంలో లైన్ ట్రిప్ అవడంతోనే కరెంటు పోయిందని విద్యుత్ అధికారులు ప్రకటన చేశారు.