హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఆలిండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ (ఏఐపీఈఎఫ్) చైర్మన్ శైలేంద్ర దూబే అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలను దేశం అనుసరిస్తే మిగులు విద్యుత్తు సాకారమవుతుందని తెలిపారు. శనివారం బేగంపేట హరితప్లాజా హోటల్లో నిర్వహించిన ఆలిండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ ఫెడరల్ ఎగ్జిక్యూటివ్ (ఆఫీస్ బేరర్ల) సమావేశంలో ఆయన మాట్లాడారు.
విద్యుత్తు ఉత్పత్తిపై కేంద్ర ప్రభుత్వానికి ముందుచూపులేదని విమర్శించారు. అదే తెలంగాణ ప్రభుత్వం ఆరేండ్ల ముందుగానే విద్యుత్తు ఉద్యోగులతో చర్చించి సమగ్ర ప్రణాళికలు రూపొందించిందని ప్రశంసించారు. ఆరేండ్లకు కావాల్సిన విద్యుత్తు ఉత్పత్తి కోసం బీహెచ్ఈఎల్తో ఒప్పందం చేసుకొని పటిష్ఠ చర్యలు తీసుకోవడం అభినందనీయమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆలిండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. డబుల్ ఇంజిన్ రాష్ర్టాల్లో సమన్వయ లోపంతో విద్యుత్తు సమస్యలు ఏర్పడుతుంటే తెలంగాణలో కరెంటు కోతల్లేకపోవడం ఆశ్యర్యంగా ఉన్నదని అన్నారు.
విద్యుత్తు సవరణ బిల్లును తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యతిరేకించడం హర్షణీయమని శైలేంద్ర దూబే అన్నా రు. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ అసెంబ్లీ తీర్మాణం చేసినందుకు కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ పలు రాష్ర్టాల సీఎంలు ప్రధాని మోదీకి లేఖలు రాశారని చెప్పారు. బెంగాల్ సీఎం మమతాబెనర్జీ ఏకంగా 24 పేజీల లేఖ రాశారని గుర్తుచేశారు.
కేసీఆర్ అన్ని రాష్ర్టాల సీఎంలను ఏకంచేసి విద్యుత్తు బిల్లుపై పోరాటం చేయాలని, ఆ పోరాటానికి తాము మద్దతు ఇస్తామని ప్రకటించారు. అన్నివర్గాల నుంచి వ్యతిరేకత వస్తున్నా కేంద్రపాలిత ప్రాంతాల్లో విద్యుత్తు సవరణ బిల్లును కేంద్రం అమలు చేస్తున్నదని విమర్శించారు. కేంద్రం తక్షణమే ఈ చర్యలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. దాద్రానగర్- హవేలీ, డామన్ – డయ్యూ, చండీగఢ్లో లాభాల్లో ఉన్న విద్యుత్తు సంస్థలను ప్రైవేటు కంపెనీలకు కేంద్రం అమ్మేస్తున్నదని ఆరోపించారు. సమావేశంలో ఏఐపీఈఎఫ్ సలహాదారులు అశోక్రావు, పీఎన్ సింగ్, ఉపాధ్యక్షులు టీ జయంతి, సునీల్ జగ్తప్ తదితరులు పాల్గొన్నారు.