Power Cuts | కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు కోతలు నిత్యకృత్యాలుగా మారాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లోనే కరెంటు కోతలు ఇబ్బంది పెట్టగా.. తాజాగా కేంద్రమంత్రి పాల్గొన్న ఓ కార్యక్రమంలోనూ ఇదే రిపీట్ అయ్యింది.
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని సుంకిడి, ఉండం గ్రామాల్లో బుధవారం కేంద్రమంత్రి అర్జున్ ముండా పర్యటించారు. ఉండం గ్రామంలోని ఆయేషా గార్డెన్లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అర్జున్ ముండా మాట్లాడుతుండగా సడెన్గా కరెంటు పోయింది. కేంద్రమంత్రి కంటే ముందు ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ మాట్లాడుతుండగా మైక్ సౌండ్ మూగబోయింది. అప్పుడు వెంటనే కరెంట్ వచ్చినా.. కొద్దిసేపటికే కేంద్రమంత్రి మాట్లాడుతుండగా మళ్లీ కరెంటు పోయింది. దాదాపు అరగంట సేపు కరెంట్ పోవడంతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో కాంగ్రెసోళ్లు కావాలనే కరెంట్ కట్ చేశారని బీజేపీ నాయకులు, కార్యకర్తలు సెటైర్లు వేసుకున్నారు. ఇక చేసేది లేక జనరేటర్ల సహాయంతో కార్యక్రమాన్ని కొనసాగించారు.