జీహెచ్ఎంసీలోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాలో అంతరాయానికి చింతిస్తున్నాం. వచ్చే వేసవి, రబీ సీజన్ను దృష్టిలో పెట్టుకొని వార్షిక నిర్వహణ పనులు జరుగుతున్నాయన్న విషయం అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. అధిక డిమాండ్ దృష్ట్యా (రోజూ) రెండు గంటలపాటు కరెంటు కోతలు అవసరం పడవచ్చు.
మెయింటనెన్స్ అనేది నిరంతర ప్రక్రియ. ఇది ప్రతి రెండో శనివారం జరుగుతుంది. మొత్తం విద్యుత్తు సరఫరాపై ఇది ప్రభావం చూపదు.
Power Cuts | హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 14 (నమస్తే తెలంగాణ): చలికాలంలోనే రాష్ట్రంలో కరెంటు కోతలకు ముహూర్తం ఖరారైపోయింది. రోజూ రెండుగంటలు కరెంటు కోతలు ఉండవచ్చని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషార్రఫ్ అలీ ఫారూఖీ ఆదివారం స్వయంగా వెల్లడించారు. జీహెచ్ఎంసీ పరిధిలో కరెంటు తరుచూ పోతున్నదని నెటిజన్లు సోషల్మీడియా ప్లాట్ఫాం ఎక్స్లో ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆయన కరెంటు కోతలపై చూచాయగా వెల్లడించారు. ‘జీహెచ్ఎంసీలోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాలో అంతరాయానికి చింతిస్తున్నాం.
వచ్చే వేసవి, రబీ సీజన్ను దృష్టిలో పెట్టుకొని వార్షిక నిర్వహణ పనులు జరుగుతున్నాయన్న విషయం అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. అధిక డిమాండ్ దృష్ట్యా (రోజూ) రెండు గంటలపాటు కరెంటు కోతలు అవసరం పడవచ్చు’ అని తెలిపారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఈ ట్వీట్ను డిలీట్ చేసి మరో ట్వీట్ చేశారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకంటే జీహెచ్ఎంసీలో విద్యుత్తు సరఫరాలో అంతరాయం అధికంగా ఉండవచ్చు. మెయింటనెన్స్ పనిని బట్టి ఆయా ప్రాంతాల్లో 30 నిమిషాల నుంచి 2 గంటల వరకు ఉండే అవకాశం ఉన్నది అని వివరించారు. ‘మెయింటనెన్స్ అనేది నిరంతర ప్రక్రియ. ఇది ప్రతి రెండో శనివారం జరుగుతుంది. మొత్తం విద్యుత్తు సరఫరాపై ఇది ప్రభావం చూపదు’ అని వెల్లడించారు.
ముషార్రఫ్ ప్రకటనపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నెలరోజుల్లోనే తెలంగాణకు మళ్లీ కరెంటు కోతలు తీసుకొచ్చిందని ఎద్దేవా చేస్తున్నారు. నిషేధిత మెటాలిక్ కైట్ మాంజాలతో విద్యుదాఘాతాలు కలిగే అవకాశమున్నందున అంతరాయాలు అనివార్యమవుతున్నాయని ప్రకటించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. గాలిపటాలతో గ్రేటర్లో విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలుగుతుందని చెప్పటం హాస్యాస్పదంగా ఉన్నదన్న మండిపడుతున్నారు. ముషార్రఫ్ తన ట్వీట్లను తొలగించినప్పటికీ వాటి స్క్రీన్షాట్లను నెటిజన్లు భారీగా షేర్చేశారు. సికింద్రాబాద్ ప్రాంతంలోని కొన్ని కాలనీల్లో అర్ధరాత్రి కూడా చాలాసేపు కరెంటు తీసేస్తున్నారని, ఆ సమయంలో ఏం మెయింటనెన్స్ పనులు చేస్తున్నారని నిలదీస్తున్నారు. గత తొమ్మిదేండ్లలో మెయింటనెన్స్ చేయలేదా? అప్పుడు ఇలాగే కరెంటు కోతలు ఏర్పడలేదు కదా? అని ప్రశ్నిస్తున్నారు.