హైదరాబాద్ : విద్యుత్ పరిరక్షణను పాఠ్యాంశంగా చేర్చే దిశగా చర్యలు తీసుకుంటామని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి తెలిపారు. దీనిపై పాఠశాల విద్యాశాఖకు లేఖ రాయాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్ శర్మకు సూచించారు. మంగళవారం రెడ్కో ఆధ్వర్యంలో ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్స్ కార్యక్రమంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలుష్యం మానవజాతికి సమస్యగా మారిందని పేర్కొన్నారు. థర్మల్ విద్యుత్తు ఉత్పత్తితో తీవ్రంగా కాలుష్యం అవుతోందని అన్నారు.
ఉద్యమంలా కృషి చేస్తే తప్పా కాలుష్యాన్ని ఆపలేమన్నారు. పునరుత్పాదక ఇంధనాన్ని వాడి కాలుష్య నివారణకు కృషి చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమంతో రాష్ట్రంలో కాలుష్యం చాలా వరకు తగ్గిందని వెల్లడించారు. ఇంధన పరిరక్షణకు సీఎం కేసీఆర్ చేస్తున్న కృషికి అవార్డు ఇవ్వాలన్నారు. రేపటి తరాలకు మంచి పర్యావరణాన్ని అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. ఇంధన పరిరక్షణ, కాలుష్యనియంత్రణకు రెడ్కో తీసుకుంటున్న చర్యలను అభినందించారు.
రెడ్కో చైర్మన్ వై.సతీశ్ రెడ్డి ముఖ్యమంత్రి చేపట్టిన హరిత హారంతో రాష్ట్రంలో నాలుగు శాతం పచ్చదనం పెరగడాన్ని పార్లమెంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వ కృషిని అభినందించిదని తెలిపారు.హైదరాబాద్ తో పాటు జిల్లాల్లోనూ ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ స్టేషన్ల సంఖ్య పెంచేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్ శర్మ, జెన్కో, ట్రాన్స్ సీఎండీ ప్రభాకర్ రావు, ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి , మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు అవార్డులు అందజేశారు.