శ్రీశైలం : పౌర్ణమి సందర్భంగా భ్రమరాంబ మల్లికార్జున క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో లవన్న ఆధ్వర్యంలో అర్చక వేదపండితులచే శాస్త్రోక్తంగా అభిషేకార్చనలు జరిపించారు. శనివారం ఉదయం దత్తజయంతి సందర్భంగా ప్రధానాలయంలో కొలువైన దత్తాత్రేయునికి షోడషోపచార క్రతువులు నిర్వహించారు. సాయంత్రం ప్రదోషకాలంలో అమ్మవారికి లక్షకుంకుమార్చన, ఊయలసేవ, పల్లకీసేవను నేత్రపర్వంగా నిర్వహించారు. అదే విధంగా ఆలయ ప్రధాన గోపురం నుంచి నందిమండపం మీదుగా బయలు వీరభద్రస్వామిని దర్శించుకుంటూ శ్రీశైల గిరిప్రదక్షిణ చేశారు. స్వామిఅమ్మవార్ల ఉత్సవ విగ్రహాలతో అధిక సంఖ్యలో భక్తులు శివనామస్మరణ, భజనలు చేస్తూ గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు.