హైదరాబాద్, ఆగస్టు 9(నమస్తే తెలంగాణ): సాధ్యమైనంత త్వరలో పూసల సామాజికవర్గం కోసం ప్రత్యేక రాయితీలతో ప్రభుత్వం పథకం తెస్తుందని రాష్ట్ర ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ హామీఇచ్చారు. కొన్ని కులాలను సాంకేతిక సమస్యల వల్ల ఎంబీసీలో చేర్చలేదని, పూసల కులస్థులు తప్పకుండా ఎంబీసీలో ఉంటారని స్పష్టంచేశారు. సోమవారం రాష్ట్ర పూసల సంఘం ప్రతినిధి బృందంతో బోయినపల్లి వినోద్కుమార్ మంత్రుల నివాసంలో భేటీ అయ్యారు. తెలంగాణలో అణగారిన జాతుల్లో ఒకటైన పూసల కులస్థుల స్థితిగతులపై ఇటీవల క్యాబినెట్లో చర్చ జరిగిందని వినోద్కుమార్ తెలిపారు. పూసల కులానికి చెందిన తల్లులు నెత్తిన గంప పెట్టుకుని గాజులు, అద్దాలు వంటి అలంకార వస్తువులను అమ్ముకుంటారని, వివిధ గృహోపకరణ వస్తువులను కూడా వాయిదాల పద్దతిలో ఇచ్చి ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తారని, బ్యాంకర్లతో సంబంధం లేకుండా నూటికి నూరు శాతం రాయితీతో ప్రత్యేక పథకం ప్రకటించే యోచనలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఉన్నారని తెలిపారు. వినోద్కుమార్ను కలిసినవారిలో సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు గుంటిపల్లి వెంకట్, గుండ్లపల్లి సత్యనారాయణ, కోశాధికారి కావేటి దిలీప్, రాష్ట్ర నేతలు పొదిలి వెంకటరమణ, చేని వెంకన్న తదితరులు ఉన్నారు.