యాదాద్రి : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రంలో స్వయంభూ నారసింహుడికి నిజాభిషేకం అత్యంత వైభవంగా సాగింది. సోమవారం తెల్లవారుజామున బ్రహ్మి ముహూర్తంలో సుప్రభాత సేవలో స్వయంభూ నారసింహుడిని మేల్కొలిపిన అర్చకులు తిరువారాధన, ఉదయం ఆరగింపు చేపట్టారు. అనంతరం పంచామృతాలతో స్వయంభూ నారసింహుడికి అభిషేకం జరిపారు. ఈ సందర్భంగా భక్తులకు స్వామివారి నిజరూప దర్శనం కల్పించారు. అనంతరం స్వామివారికి తులసీ నామార్చన, అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాలు శాస్ర్తోక్తంగా జరిగాయి. భక్తులతో నిర్వహించే ఆర్జిత పూజలు అత్యంత వైభవంగా కొనసాగాయి.
ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం నిర్వహించి స్వామి, అమ్మవార్లను గజ వాహనంపై వేంచేపు చేసి కల్యాణోత్సవ సేవను నిర్వహించారు. తూర్పునకు అభిష్టంగా స్వామి, అమ్మవార్లను వేంచేపు చేసి నిత్య తిరుకల్యాణోత్సవం జరిపారు. సాయంత్రం తిరువీధిసేవ, దర్భార్ సేవ, రాత్రి నివేదన, శయనోత్సవ కార్యక్రమాలు జరిపి ఆలయాన్ని మూసివేశారు. సువర్ణమూర్తులకు బంగారు పుష్పాలతో పలు దఫాలుగా అర్చనలు జరిగాయి. సుమారు 20వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలను కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.39,70,519 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.