Ponnam Prabhakar | ఆర్టీసీ సమ్మెను విరమించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. సమస్యలకు సమ్మె పరిష్కారం కాదని ఆయన సూచించారు. సమస్యల పరిష్కారానికి నలుగురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేసిందని.. 4 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించామని తెలిపారు. కమిటీల పేరుతో కాలయాపన చేస్తామనడం పొరపాటు అని స్పష్టం చేశారు.
ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన 32 అంశాల్లో 29 అంశాలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి వ్యతిరేకత లేదని పొన్నం ప్రభాకర్ తెలిపారు. అవన్నీ వెంటనే పరిష్కారమయ్యే అంశాలని పేర్కొన్నారు. ఆర్టీసీ విలీనం, గుర్తింపు సంఘాల ఎన్నికలు రెండు పెండింగ్లో ఉన్నాయని అన్నారు. ఈ రెండు అంశాల్లో పలు సాంకేతిక అంశాలు చరించాల్సి ఉందన్నారు. వీటిపై అధ్యయనం చేసేందుకే నాలుగు వారాల గడువు అడిగామని వివరించారు. ఈ రెండు అంశాలు కూడా సీఎం, డిప్యూటీ సీఎం దగ్గర చర్చిస్తామని అన్నారు.
ఆర్టీసీ విలీనం ఆలస్యమైనప్పటికీ.. ఉద్యోగులకు ఒకటో తారీఖు జీతాలు వస్తున్నాయని పొన్నం ప్రభాకర్ తెలిపారు. గుర్తింపు సంఘాల ఎన్నికల విషయంలో నాయకుల మధ్య అంతర్యుద్ధం, నాయకత్వ అంశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని.. అన్ని అంశాలను పరిష్కరిస్తామని చెప్పారు. మిమ్మల్ని ఎవరూ అడ్డుకోరని.. ప్రజాస్వామ్య పద్ధతిలో మీ నాయకులు నిరసన తెలపవచ్చని.. ప్రజలపై ఒత్తిడి తీసుకురావచ్చని అన్నారు. అయితే పేద ప్రజల ప్రయాణాలకు ఇబ్బంది కలగజేయవద్దని విజ్ఞప్తి చేశారు. మీ నాయకులు నిరసన తెలపవచ్చని.. మిగతా వారంతా విధుల్లో చేరి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చేయాలని కోరారు.