హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): టీఎస్ఆర్టీసీలో పనిచేస్తూ విధి నిర్వహణలో మరణించిన సిబ్బంది వారసులకు కారుణ్య నియామకాల కింద కండక్టర్ ఉద్యోగాలు ఇస్తామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. మరో 275 కొత్త బస్సుల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చామని పేర్కొన్నారు. బుధవారం సచివాలయంలో ఆర్టీసీ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే పదేండ్లుగా పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలు, కండక్టర్ పోస్టుల భర్తీ సమస్యలను పరిష్కరించబోతున్నట్టు చెప్పారు. కారుణ్య నియామకాల కింద 813 మందిని కండక్టర్లగా నియమించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్ (66), సికింద్రాబాద్ (126), రంగారెడ్డి (52), నల్లగొండ (56), మహబూబ్నగర్ (83), మెదక్ (93), వరంగల్ (99), ఖమ్మం (53), ఆదిలాబాద్ (71), నిజామాబాద్ (69), కరీంనగర్ (45) రీజియన్ల నుంచి 813 కండక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నట్టు మంత్రి వివరించారు.
మహాలక్ష్మి పథకం అమలుతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నదని, బస్సులపై భారాన్ని తగ్గించేందుకు మరో 275 కొత్త బస్సులు కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించినట్టు మంత్రి పొన్నం తెలిపారు. ఆర్టీసీ బలోపేతానికి గత నెలలోనే 80 కొత్త బస్సులను ప్రారంభించి, ప్రజలకు అందుబాటులోకి తెచ్చినట్టు గుర్తుచేశారు.