CM KCR | హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ నిరవధిక దీక్ష చేయకపోతే తెలంగాణపై ఆనాటి హోంశాఖ మంత్రి చిదంబరం ప్రకటన చేసే వారా? అని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. గురువారం ఆయన తెలంగాణభవన్లో మాజీ ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేత పీ చిదంబరం సీఎం కేసీఆర్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. తెలంగాణ చరిత్రను చిదంబరం వక్రీకరించారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనను చిదంబరం వెనకి తీసుకున్నందువల్లనే తెలంగాణలో వందలాది యువకులు బలిదానం చేసుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తున్న ఆరు గ్యారెంటీలను అప్పులు చేయకుండా, భూములు అమ్మకుండా అమలు చేయగలరా? అని నిలదీశారు. వాస్తవాలు చెప్పి కాంగ్రెస్ నాయకులు ప్రజల్లోకి వెళ్ళలేరా? అని నిలదీశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 1.90 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, అప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నదని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత బీఆర్ఎస్ ప్రభుత్వం 2.25 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిన విషయం తెలియదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 80 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని విమర్శించే అర్హత కాంగ్రెస్ నాయకులకు లేదని స్పష్టంచేశారు. రాజకీయ దురుద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, రాజ్యాంగానికి లోబడి తెలంగాణ అప్పులు తీసుకుంటున్నదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కూడా లక్షల కోట్లు అప్పులు చేస్తున్నదని వివరించారు. అప్పులు చేస్తున్న రాష్ర్టాల్లో అరుణాచల్ప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంటే, తెలంగాణ 22వ స్థానంలో ఉన్నదని చెప్పారు.
కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే రాజస్థాన్ అప్పుల గురించి మాట్లాడాలని సవాల్ చేశారు. దేశంలో 2004 నుంచి 2014 వరకు రూ.2.20 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేయగా.. ఆ తర్వాత వచ్చిన మోదీ ప్రభుత్వం కేవలం 1,000 మందికి రూ.14 లక్షల కోట్లు మాఫీ చేసిందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ నాయకులకు చరిత్ర తెలియదనడం ఆశ్చర్యకరంగా ఉన్నదని పేర్కొన్నారు. ఆర్థిక పరిస్థితులపై మాట్లాడటానికి తెలంగాణ కాంగ్రెస్లో మాట్లాడే వారు లేరా? అని ఎద్దేవా చేశారు. చిదంబరం ఇక్కడికి వచ్చి మాట్లాడటం ఇక్కడి కాంగ్రెస్ నాయకులకు అవమానకరమని చెప్పారు.