Ponnala Lakshmaiah | కాంగ్రెస్ నాయకులకు ప్రాజెక్టులపై కనీస అవగాహన లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య (Ponnala Lakshmaiah) అన్నారు. రాజకీయ లబ్ధి కోసమే కాళేశ్వరం ప్రాజెక్టుపై అర్ధసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఆ ప్రాజెక్టుతోనే నేడు అనేక జిల్లాలు సస్యశ్యామలమయ్యాయని చెప్పారు. పిల్లర్లు కుంగడం వంటి చిన్న ఘటన జరిగితే మరమత్తు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంలో అనే ప్రాజెక్టులు నిర్మించినప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయన్నారు. అప్పటికప్పుడు వాటిని మరమ్మతులు చేశారు కానీ రాజకీయాలు చేయలేదని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రజలు తిప్పి కొడతారని తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం బరాజ్లపై ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు బీఆర్ఎస్ (BRS) సిద్ధమైంది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం మేడిగడ్డను సందర్శించనుంది. హైదరాబాద్లోని తెలంగాణ భవన్ నుంచి పార్టీ ఎమ్మెల్యేలు, శాసనమండలి, పార్లమెంట్ సభ్యులు, ఇతర ముఖ్య నాయకులు ప్రత్యేక బస్సుల్లో మేడిగడ్డకు బయల్దేరారు. వారితోపాటు సాగునీటిరంగ నిపుణులు కూడా ఉన్నారు. మేడిగడ్డ పరిశీలన తర్వాత అన్నారం బరాజీని పరిశీలించనున్నారు. అన్నారం వద్ద పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బరాజ్పై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టనున్నారు. ప్రజలకు వాస్తవాలను వివరించనున్నారు.