కామేపల్లి, జూలై 4: ఖమ్మం జిల్లా కామేపల్లి మండ లం కొమ్మినేపల్లి(పండితాపురం)లో కాంగ్రెస్ నాయకుడు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అనుచరులు బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేశారు. సోమవారం అర్ధరాత్రి కొమ్మినేపల్లిలో బీఆర్ఎస్ నాయకుల ఇండ్లలోకి చొరబడి పలువురిని తీవ్రంగా గాయపరిచారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పండితాపురం గ్రామానికి చెందిన మేకపోతుల లక్ష్మీ, అర్వపల్లి కోటమ్మ ఇంట్లోకి పొంగులేటి అనుచరులు అకారణంగా చొరబడ్డారు. తమ వెంట తెచ్చిన ఇనుప రాడ్లు, కత్తులు, కర్రలు, రాళ్లు, కారం పొడితో దాడి చేసి లక్ష్మీ మేడలోని బంగారపు పుస్తెల తాడును ఎత్తుకెళ్లారు. ఈ దాడిలో లక్ష్మీ, కోటమ్మకు గాయాలయ్యాయి. అక్కడే ఉన్న చల్లా నాగేంద్రబాబు, చల్లా అనిల్పై కూడా దాడి చేయగా నాగేంద్రబాబుకు కాలు విరిగింది. అనిల్ తలకు తీవ్ర గాయమైంది. క్షతగాత్రులను 108 వాహనంలో ఖమ్మం ప్రభుత్వ దవాఖానకు తరలించి వైద్యం అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఖమ్మం రూరల్ ఏసీపీ బస్వారెడ్డి పోలీస్ సిబ్బందితో గ్రామానికి చేరుకుని పరిస్థితులను సమీక్షించారు. కాగా.. పొంగులేటి అనుచరులు మంగళవారం ఉదయం మరోసారి ముగ్గురు బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేశారు. బైక్పై వెళ్తున్న చల్లా శశిని ఓ హోటల్ వద్ద అడ్డుకుని దాడికి పాల్పడ్డారు. వారిని అడ్డుకోవడానికి వెళ్లిన చల్లా వెంకటనారాయణ, చల్లా రవి చేతులు విరిగిపోయాయి. శశి తలపై కొట్టడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. శశికి హైదారాబాద్లో వైద్యం అందిస్తున్నారు. మంగళవాం రాత్రి ఇరువర్గాలు పోలీసులకు ఫిర్యాదులు చేయగా ఇరువురిపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.