హైదరాబాద్, డిసెంబర్ 14 : రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) గురువారం డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయం(BR Ambedkar Secretariat)లో బాధ్యతలు(Charge) స్వీకరించారు. ఈ పదవీ స్వీకార కార్యక్రమానికి మంత్రి కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రిని ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, వేముల వీరేశం, ఆదినారాయణ, బాలు నాయక్, ఆది శ్రీనివాస్, యశస్వినీ రెడ్డి తోపాటు పలువురు సీనియర్ నాయకులు రేణుకా చౌదరి, రామసహాయం సురేందర్ రెడ్డి, రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, ఆర్ అండ్ బీ కార్యదర్శి శ్రీనివాస రాజు, సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్ కె. అశోక్ రెడ్డి, సమాచార శాఖ డైరెక్టర్ రాజమౌళి, అడిషనల్ డైరెక్టర్ నాగయ్య, జేడీ లు జగన్, శ్రీనివాస్, వెంకట రమణ, డీడీ లు మధు సూధన్, హాష్మి, రాజా రెడ్డి, సీఐఈ రాధా కిషన్, వివిధ శాఖల ఉన్నతాధికారులు మంత్రిని కలసి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం భువనగిరి జిల్లా రాయగిరి లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి పది ఎకరాల భూమిని కేటాయిస్తూ తన మొదటి ఫెయిల్ పై మంత్రి సంతకం చేశారు. రూ. 9 .50 కోట్ల విలువ గల ఈ పదెకరాల స్థలాన్ని మల్టీ పర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి చేపట్టేందుకు యువజన, క్రీడల శాఖ కు కేటాయించారు. అలాగే రాష్ట్రంలోని 33 జిల్లాల డీపీఆర్ఓలకు అధునాతన కెమెరాలు అందజేసే సమాచార, పౌర సంబంధాల శాఖకు చెందిన ఫైల్ పైసంతకం చేశారు. గృహ నిర్మాణ శాఖ కు చెందిన పలు పరిపాలనా సంబంధిత ఫైళ్లపై సంతకం చేశారు.