హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్, వామపక్షాల మధ్య రాజకీయ అవగాహన కుదిరినా, సీట్ల పంపకాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం తమకే కేటాయించాలని సీపీఎం పట్టుబడుతున్నది. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఈ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. పొంగులేటికి పాలేరు, తుమ్మలకు ఖమ్మం కేటాయిస్తారనే ప్రచారం జరుగుతున్నది. సీపీఎం కూడా పాలేరు కోసం పట్టుబడుతుండగా వైరా నియోజకవర్గం కేటాయిస్తామని కాంగ్రెస్ చెప్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పొంగులేటిని పార్టీ అధిష్ఠానం ఢిల్లీకి పిలిపించడం ఆసక్తికరంగా మారింది.