కూసుమంచి, మే 2: ‘ఎన్నారై తల్లికి ఇందిరమ్మ ఇల్లు’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో ఇటీవల వార్త ప్రచురితం కావడంతోపాటు అదే విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మంత్రి పొంగులేటి సీరియస్ అయ్యారు. సదరు లబ్ధిదారు అర్హతలపై విచారణ చేపట్టాలంటూ కలెక్టర్ను ఆదేశించారు. దీంతో హౌసింగ్ పీడీ సహా ఇతర అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే ఆమెకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశామని, ప్రతిభ ఆధారంగా ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లిన ఆమె కొడుకును ఎన్నారైగా పరిగణించలేమని, ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యాకే అతడు బ్యాంకు రుణంతో లండన్ వెళ్లాడని, ఆమె కూతురు కూడా పీజీ పూర్తిచేసి ప్రైవేట్ జాబ్ చేస్తున్నదని విచారణలో తేల్చారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలం పాలేరులో గత నెల 29న ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ క్రమంలో పాలేరుకు చెందిన పిల్లి నీలమ్మ అనే ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారురాలు మైక్ తీసుకొని మాట్లాడారు. తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని, నలుగురు సంతానంలో ఒకరు లండన్లో చదువుకుంటున్నారని, మరొకరు విద్యుత్తురంగంలో ఉద్యోగం చేస్తున్నారని, ఇంకొకరు సోషల్ మీడియాలో పనిచేస్తున్నారని చెప్పడంతో సభలో ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు.
వెంటనే మంత్రి స్పందిస్తూ.. ‘వీరికి ఇందిరమ్మ ఇంటిని ఎలా మంజూరు చేశారు?’ అంటూ సర్పంచ్ను ప్రశ్నించారు. ఈ మొత్తం ఘటన ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితం కావడంతోపాటు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో సదరు లబ్ధిదారుకు ఏ నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇచ్చారో తేల్చాలంటూ ఖమ్మం కలెక్టర్ను మంత్రి ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు హౌసింగ్ పీడీ సహా ఇతర అధికారులు వెళ్లి క్షేత్రస్థాయి విచారణ చేపట్టారు. సదరు లబ్ధిదారు కుటుంబ నిరుపేద కుటుంబమేనని, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే ఆమెకు ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేశామని తేల్చారు.