హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని దుర్గంచెరువులో కాలుష్యం, ఆక్రమణలపై హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరణలు లేకుండానే ఆక్రమణలు లేవని, కాలుష్యం వెదజల్లడం లేదని నివేదిక ఇచ్చేస్తారని మండిపడింది. చెరువులో కాలుష్యం, ఆక్రమణలపై తాము ప్రభుత్వ అధికారుల నివేదికపై ఆధారపడబోమని స్పష్టం చేసింది.
అధికారులు చెప్పినా విననివారితో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపింది. నిబద్ధతతో వ్యవహరించే వారితో ప్రత్యేక కమిటీని ప్రతిపాదించాలని కోర్టుకు సహాయకారి (అమికస్ క్యూరీ)గా నియమితులైన సీనియర్ న్యాయవాది వేదుల శ్రీనివాస్ను ఆదేశించింది. ప్రత్యేక కమిటీలో నిఖార్సుగా పనిచేసే అధికారులతోపాటు పర్యావరణవేత్తలు, ఎన్జీవోల సభ్యులు, ఒక సీనియర్ న్యాయవాది కూడా ఉండాలని సూచించింది. దుర్గంచెరువు వద్ద విద్యుత్తు కాంతుల వెలుతురులో అకడి కాలుష్యం, ఆక్రమణలు కనిపిస్తున్నాయని ఒక ఇంగ్లిష్ పత్రికలో వచ్చిన కథనాన్ని హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ కేసుపై విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది.