Telangana Assembly Elections | హైదరాబాద్, అక్టోబరు 30 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని 13 మావోయిస్టు ప్రభావిత అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ను గంట ముందుగానే ముగించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. నవంబర్ 30న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. మిగిలిన నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. గత సాధారణ ఎన్నికల సమయంలో జరిగిన విధంగానే ఈ సారి కూడా 13 నియోజకవర్గాల్లో గంట ముందుగానే పోలింగ్ ముగిస్తారు. ఇందుకు అనుగుణంగా ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
పోలింగ్ బూత్ల నుంచి రిసెప్షన్ సెంటర్కు చేరుకోవడానికి అనువుగా ముందుగానే పోలింగ్ను ముగించాలని పోలీసుల సూచనతో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. రిసెప్షన్ సెంటర్ వరకు చేరుకునే సరికి రాత్రయితే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందనే అంచనాతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 13 నియోజకవర్గాల పరిధిలో నక్సల్స్ ప్రభావం ఉందని అంచనా వేసి ఈ నిర్ణయం తీసుకున్నారు.
వీటిలో సిర్పూర్ కాగజ్నగర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, ఆశ్వరావుపేట, భద్రాచలం నియోజకవర్గాలు ఉన్నాయి. పోలింగ్ సమయం కుదింపుపై నవంబర్ 3న అధికారికంగా ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ ద్వారా ఉత్తర్వులు జారీ చేయనుంది.