నారాయణపేట/వడ్డేపల్లి/జనగామ/కృష్ణకాలనీ, ఫిబ్రవరి 11 : మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా విధులు నిర్వర్తించిన పోలింగ్ అధికారులు, సిబ్బంది రెమ్యునరేషన్ తగ్గించి ఇవ్వడంపై ఆందోళనకు దిగారు. రూ.1,300 కుగాను రూ.800 ఇవ్వడాన్ని నిరసిస్తూ బుధవారం సాయంత్రం పలు జిల్లాల్లో బైఠాయించారు. నారాయణపేట జిల్లా కేంద్రంతోపాటు, జోగుళాంబ గద్వాల జిల్లా శాంతినగర్లోని స్ట్రాంగ్ రూం కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు.
వడ్డేపల్లిలో ఎన్నికల విధులు నిర్వహించడానికి వచ్చిన పీవో, ఏపీవోలు, ఓపీవోలకు సక్రమంగా రెమ్యునరేషన్ ఇవ్వకపోడంతో పోలింగ్ బాక్సులు ఇవ్వమని భీష్మించారు. జనగామ, భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల విధులకు హాజరైన పోలింగ్ సిబ్బంది బుధవారం రాత్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద మెరుపు ధర్నాకు దిగారు. ఇతర జిల్లాల్లో రెండు రోజుల విధులకు రూ. 1,300 చెల్లిస్తే తమకు మాత్రం కోత పెట్టడం ఏమిటని అధికారులను నిలదీశారు. కోత లేకుండా చెల్లించాలని డిమాండ్ చేశారు.