నమస్తే తెలంగాణ నెట్వర్క్, నవంబర్ 30: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు పోటెత్తారు. గురువారం జరిగిన పోలింగ్ సందర్భంగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కావడంతో అనేకచోట్ల ఓటర్లు అప్పటికే క్యూకట్టారు. మధ్యాహ్నం కొంత మందకొడిగా సాగిన ఆ తరువాత మళ్లీ ఓటింగ్ శాతం పుంజుకున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతోపాటు పలుచోట్ల రాత్రి 9.30 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగింది. వీరంతా సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కేంద్రానికి చేరుకొని క్యూలో నిల్చోడంతో పోలింగ్కు అవకాశం కల్పించారు. చాలాచోట్ల కొత్త ఓటర్లు ఉత్సాహంగా కనిపించారు. ఓటు వేసి వచ్చి సిరా గుర్తు చూపుతూ ఫొటోలు దిగారు.
వృద్ధులు, దివ్యాంగులు సైతం భారీగా కదిలివచ్చారు. వీరి కోసం పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వీల్చైర్లతోపాటు సహాయకులను అందుబాటులో ఉంచారు. సిద్దిపేట పట్టణంలోని బారాయిమామ్కు చెందిన 104 ఏండ్ల వృద్ధురాలు జోహరబీ ఇంటి నుంచి నడుచుకుంటూ వెళ్లి నాసర్పురా పోలింగ్ బూత్లో ఓటు హక్కును వినియోగించుకొని పలువురికి ఆదర్శంగా నిలిచింది. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం కిష్టంపేటలో నవ దంపతులు ఓటు వేశారు. జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం మేడికొండకు చెందిన నిండు గర్భిణి మాధవికి మధ్యాహ్నం పురిటి నొప్పుల మొదలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లగా ఓటు వేసింది.
అనంతరం ఆమెను 108లో అయిజ పీహెచ్సీకి తరలించగా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని గట్లకానిపర్తిలో జంట కవలలు తొలిసారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం ఆవంచలో జక్కుల రాములు అనే వ్యక్తి మరణించగా, ఆయన కుమారుడు, సోదరుడు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులు ఆయా నియోజకవర్గాల్లో తమ ఓటు వేశారు.