నల్లగొండ, జూన్1(నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలో రాజకీయ కోతులు సంచరిస్తున్నాయని, పచ్చని పంటల్లో గంతులు వేస్తూ వ్యవసాయ రంగాన్నే నాశనం చేసేందుకు కుట్రలు చేస్తున్నాయని ప్రతిపక్షాల తీరును ఉద్దేశించి రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు. రాజకీయ కోతులు అడుగడుగునా రైతు సంక్షేమ పథకాలను అడ్డుకొని రైతులకు నష్టం చేకూర్చాలని యత్నిస్తున్నాయని ఆరోపించారు.
యాసంగిలో రాష్ట్ర ప్రభుత్వం పలానా పంట వేయొద్దని చెబితే.. కోతి చేష్టల ప్రతిపక్షాలు అదే వేయాలని రైతులను రెచ్చగొట్టిన విషయాన్ని గుర్తుచేశారు. నల్లగొండ జిల్లాకేంద్రంలో నిర్వహించిన నల్లగొండ, యాదాద్రి జిల్లాల వానకాలం సాగు సదస్సులో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మంత్రులు నిరంజన్రెడ్డి, జగదీశ్రెడ్డితో కలిసి రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి పాల్గొని, ప్రసంగించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయం చేయాలని చూస్తే గతంలో నల్లగొండ రైతులు తరిమితరిమి కొట్టిన విషయం తెలిసిందేనన్నారు.
2014లో 1,400 ఆత్మహాత్యలు జరిగితే తెలంగాణ వచ్చాక పూర్తిగా తగ్గిపోయాయని స్పష్టంచేశారు. రైతుబీమా సాయాన్ని కూడా రాజకీయం చేస్తూ, సహజ మరణాలను ఆత్మహత్యలుగా చిత్రీకరిస్తూ దిగజారుడుతనాన్ని ప్రదర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. రైతుబంధు, రైతుబీమాను అడ్డుకుంటామంటూ ప్రతిపక్ష నేతలు చేస్తున్న ప్రకటనలను ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. మ్యానిఫెస్టోలో లేకున్నా రైతుబంధు, రైతుబీమా లాంటి ఎన్నో పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనని స్పష్టంచేశారు. కాంగ్రెస్ నేతలు ఇక్కడ చేసిన రైతు డిక్లరేషన్ను తాము అధికారంలో ఉన్న మూడు రాష్ర్టాల్లో ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు.
వ్యవసాయానికి ఉపాధిహామీని అనుసంధానించాలని, కనీస మద్దతు ధర చట్టం తేవాలని, ఎంఎస్ స్వామినాథన్ సిఫార్సులను అమలు చేయాలని గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు నరేంద్రమోదీ అప్పటి ప్రధానిని డిమాండ్ చేశారని.. ఇప్పుడు తానే ప్రధానిగా ఉన్నా కూడా వాటి ఊసే ఎత్తడం లేదని మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. దేశానికి జాతీయ వ్యవసాయ విధానాన్ని తీసుకురావాల్సి ఉండగా, రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ర్టానికో తీరుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో వ్యవసాయాభివృద్ధికి సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో కృషిచేస్తుండగా, దాన్ని అడ్డుకొనేందుకు జాతీయ పార్టీలు కుట్రలు చేస్తుండటాన్ని గమనించాలన్నారు. కాంగ్రెస్, బీజేపీ లు రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంటు పథకాలు అమలు చేస్తామని ప్రకటించాలని డిమాండ్ చేశారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలనే పండించాలన్నారు. పప్పుగింజలు, నూనెగింజలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నదని.. రైతులు కంది, మినుములు, పెసర్లు, నువ్వులు, ఆముదం సాగుకు మొగ్గు చూపాలని కోరారు.
రెండేండ్లలో రాష్ట్రంలో 10 లక్షల ఎకరాలకు ఆయిల్పాం సాగును పెంచే దిశగా చర్యలు చేపట్టామన్నారు. దీన్ని ప్రోత్సహించాల్సిన కేంద్రం ఏటా 80 వేల నుంచి 90 వేల కోట్లు వెచ్చించి విదేశాల నుంచి దిగుమతికే మొగ్గు చూపుతున్నదని విమర్శించారు. ప్రభుత్వ సూచనలను ఎప్పటికప్పుడు రైతులకు చేరవేయాలని, రైతువేదికలను శిక్షణ కేంద్రాలుగా తీర్చిదిద్దాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు.
రైతును లక్షాధికారిగా మార్చడమే ప్రభుత్వ సంకల్పమని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి స్పష్టంచేశారు. 2014కు ముందు నీళ్లు లేక, కరెంటు లేక, పంటల పండక అనేక విషాద ఘట్టాలకు తెలంగాణ వేదికగా ఉండేదని, నేడు 24 గంటల కరెంటుతోపాటు పుష్కలమైన సాగునీరు ఉండటంతో పంటలు బాగా పండి రాష్ట్రం అన్నపూర్ణగా మారిందని చెప్పారు.
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ స్వయంగా రైతు కావడం వల్ల సాగులో రాష్ర్టాన్ని దేశంలోనే నంబర్ వన్గా తీర్చిదిద్దారన్నారు. ఇతర రాష్ర్టాల అధికారులు రాష్ట్రంలోని పద్ధతులపై అధ్యయనం కోసం వస్తుండటం మన రైతాంగానికి గర్వకారణమని చెప్పారు. వ్యవసాయం అంటే తెలువని వారు రాజకీ య యాత్రలు చేస్తుండటం సిగ్గుచేటన్నారు.