హైదరాబాద్, ఫిబ్రవరి 21(నమస్తే తెలంగాణ) : యూత్ కాంగ్రెస్ సభ్యులు తమ అల్ప రాజకీయ నాటకాల కోసం ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026’ను వేదికగా చేసుకోవడం అత్యంత విచారకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఇలాంటి అంతర్జాతీయ వేదికలను తమ నిరసనల కోసం ఉపయోగించుకోవడం వల్ల ప్రపంచ దేశాల ముందు మన దేశ ప్రతిష్ఠ దెబ్బతింటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు ఉండటం సహజమే కానీ, ఎకడ ఎలా నిరసన తెలుపాలో అనేది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమని కేటీఆర్ కాంగ్రెస్ నాయకులకు హితవు పలికారు.
రాజకీయ అసమ్మతిని వ్యక్తం చేసేందుకు ఒక సమయం, సందర్భం అనేవి ఉంటాయని, ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’ వంటి అంతర్జాతీయ సదస్సు కచ్చితంగా దానికి వేదిక కాదని దుయ్యబట్టారు. వారి సొంత పార్టీ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అదే ఏఐ సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలోనే యూత్ కాంగ్రెస్ నాయకులు ఈ విధంగా నిరసన తెలుపడం విచిత్రంగా ఉన్నదని కేటీఆర్ విమర్శించారు.
ఎస్ఎల్బీసీ సొరంగం కుప్పకూలి ఏడాది కావొస్తున్నా కార్మికుల మృతదేహాలను వెలికితీయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, కనీసం చివరి చూపు చూసుకొనే అవకాశం లేకుండా మానసిక క్షోభకు గురిచేసిందని కేటీఆర్ ఎక్స్ ద్వారా మండిపడ్డారు. అటు సొరంగం పనుల్లోనూ ఎలాంటి పురోగతి లేకపోవడం సీఎం రేవంత్రెడ్డి చేతకానితనానికి నిదర్శనమని దుయ్యబట్టారు. కమీషన్లు, కాంట్రాక్టులు, వాటాలపై పెట్టే శ్రద్ధ, ఇకనైనా కార్మిక సంక్షేమం, ప్రజాశ్రేయస్సు మీద పెడితే ఇలాంటి విషాదాలు పునరావృతం కావని హితవు పలికారు.