నాంపల్లి : మునుగోడు ఎన్నికల తరువాత కోమటిరెడ్డి బ్రదర్స్కు రాజకీయ జీవితం కనుమరుగు ఖాయమని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా నాంపల్లిలో మీడియాతో మాట్లాడారు. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో అన్ని అబద్ధాలే మాట్లాడుతున్నారని ఆరోపించారు.
నియోజకవర్గ ప్రజలు ఆత్మాభిమానాన్ని తాకట్టుపెట్టి బీజేపీలో చేరి ఎన్నికలకు కారకులైన రాజగోపాల్ రెడ్డిని అడుగడుగున ప్రజలు నిలదీస్తున్నా సిగ్గు లేకుండా తిరుగుతున్నాడని విమర్శించారు. గడిచిన ఎనిమిదేండ్లలో బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఏమి మేలు చేసిందో చెప్పకుండా ఓట్లు అడగడం దారుణమని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న గొర్రెల పంపిణీ పథకాన్ని బీజేపీ నాయకులు అడ్డుకొని గొల్ల కురుముల పొట్ట కొట్టారని పేర్కొన్నారు.
ముఖ్య మంత్రి కేసీఆర్ నాయకత్వమే తెలంగాణ కు శ్రీరామరక్ష అని అన్నారు. ఎన్నికల్లో గెలుపొందేందుకు అడ్డదారులు తొక్కుతున్న బీజేపీ నాయకుల వద్ద కోట్ల రూపాయలు అధికారుల తనిఖీల్లో దొరుకుతున్నాయని ఆరోపించారు. ఎన్నికల్లో ఓటమి భయంతో అరాచకంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.