హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ)/అందోల్: పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 37,53,814 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేసినట్టు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా సంగారెడ్డి జిల్లా జోగిపేటలోని ఏరియా దవాఖానలో ప్రారంభించారు. రాష్ట్రంలో ఐదేండ్లలోపు చిన్నారులు 40.57 లక్షల మంది ఉన్నట్టు అధికారులు అంచనా వేశారు. వీరిలో 92.57 శాతం మందికి పోలియో చుక్కలు వేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పోలియోరహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషిచేయాలని కోరారు. ప్రతి చిన్నారికి పోలియో చుక్కల మందు వేయిస్తేనే ఆరోగ్యకర భారత్ సాకారం అవుతుందని తెలిపారు. సోమవారం నుంచి రెండు రోజులపాటు ఇంటింటికీ తిరిగి పోలియో చుక్కలు వేయనున్నట్టు పేర్కొన్నారు. ఆదివారం అందుబాటులో లేనివారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.