భవిష్యత్తుకు భరోసానిచ్చేలా వ్యవసాయ వర్సిటీ ఉండాలని.. ఆ భూములను ఇతర నిర్మాణాలకు ఇవ్వొద్దని నినదించిన విద్యార్థి నాయకురాలిపై పోలీసులు జులుం ప్రదర్శించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్నా కర్కశంగా ప్రవర్తించారు.
రాజేంద్రనగర్లోని వర్సిటీ భూములను హైకోర్టు నిర్మాణాలకు ఇవ్వొద్దని డిమాండ్ చేసినందుకు విద్యార్థిని అని కూడా చూడకుండా బైక్పై కూర్చొన్న ఇద్దరు మహిళా పోలీసులు స్టూడెంట్ లీడర్ జుట్టు పట్టుకొని గొరగొరా గుంజుకుంటూ తీసుకెళ్లారు. ఈ వీడియో సోషల్మీడియాలో వైరల్కాగా, పోలీసుల తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. కాంగ్రెస్ సర్కారు కొలువుదీరగానే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండదని చెప్పినట్టే చేసిచూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు మహిళా కానిస్టేబుళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
— Naveena (@TheNaveena) January 24, 2024
Agriculture University | వ్యవసాయ యూనివర్సిటీ/ హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 23 (నమస్తే తెలంగాణ): అది రాజేంద్రనగర్లోని వ్యవసాయ యూనివర్సిటీ.. హైకోర్టు నిర్మాణానికి ప్రభుత్వం జారీ చేసిన జీవో 55ని వెనక్కి తీసుకోవాలని కొన్ని రోజులుగా రోజులు శాంతియుత నిరసనలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం కూడా నిరసన జరుగుతున్నది. సమయం మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో ఒక విద్యార్థిని యూనివర్సిటీ భూములను హైకోర్టుకు ఇవ్వొద్దంటూ ఉపన్యసించింది.
అప్పుడే రంగప్రవేశం చేసిన పోలీసులు.. శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులను చెదరగొట్టారు. ఈ క్రమంలో ఓ యువతి పరుగెత్తగా, బైక్పై వెంబడించిన ఇద్దరు మహిళా పోలీసులు.. ఆమె జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లారు. ఆ యువతి అదుపు తప్పి రోడ్డుపై కుప్పకూలినా, ఆమె జుట్టు వదలకుండా ముందుకు లాక్కెళ్లారు. దీంతో ఆమెకు చేతులు, కాళ్లు, శరీరముందు భాగంలో గాయాలయ్యాయి. ‘ఇదేం పద్ధతి?’ అని ఆ బాధిత యువతి కంటతడి పెట్టుకుంటూ ప్రశ్నించగా, ఇట్లనే ఉంటది సీన్ అంటూ ఆ కానిస్టేబుల్ నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వటం గమనార్హం.
ఇదేం పాలన?
ఈ ఘటనపై ప్రజలు తీవ్రంగా మండిపడ్డారు. సోషల్ మీడియాలోనూ నెటిజన్లు ప్రభుత్వం, పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఆ విద్యార్థిని ఏం అడిగింది? యూనివర్సిటీకి చెందిన భూములను ఇతర నిర్మాణాలకు ఇవ్వొద్దని కోరింది. ఇందులో ఆమెకు సొంతంగా ఒనగూరేది ఇసుమంతైనా ఉన్నదా? లేదు. రేపటి తరానికి భరోసానిచ్చేలా వ్యవసాయ యూనివర్సిటీ ఉండాలనేదే ఆమె ఆకాంక్ష. ఎవరైనా తమ నిరసన తెలుపవచ్చని సీఎం రేవంత్ చెప్తూనే ఉన్నారుగా! మరి ఈ ప్రకటనకు తగ్గట్టు పరిస్థితులు ఉన్నాయా? లేనేలేవు.
అమ్మాయి అని కూడా చూడకుండా గొరగొర ఈడ్చుకెళ్లటమా?’ అని ధ్వజమెత్తారు. నాడు తెలంగాణ ఉద్యమ సందర్భంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులపై పోలీసుకాండ కొనసాగించిందని, హాస్టళ్లలోకి చొరబడి లైట్లు ఆర్పేసి అమ్మాయిపైనా లాఠీలతో విరుచుకుపడ్డారని గుర్తుచేస్తున్నారు. పదేండ్ల తర్వాత మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీసులు మరోసారి మళ్లీ కఠినత్వానికి తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు మహిళా కానిస్టేబుళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
విద్యార్థులను గూండాలుగా చూస్తారా?: ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ
దేశానికి అన్నం పెట్టే వ్యవసాయ యూనివర్సిటీ భూములతో రియల్ వ్యాపారం చేయడం సిగ్గు చేటని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ మండిపడ్డారు. పర్యావరణానికి దోహదపడుతున్న జీవరాశిని కాపాడాల్సిన పాలకులే, నాశనం చేయాలని చూస్తే సహించేది లేదని మండిపడ్డారు. నిరసన చేపట్టిన విద్యార్థులను గూండాలుగా చూస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, నిరసనల్లో వ్యవసాయ వర్సిటీ విద్యార్థులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నాగర్ కర్నూల్ జిల్లా పాలెం, సిరిసిల్ల, వరంగల్, ఆదిలాబాద్, వరంగల్, సిరిసిల్ల, అశ్వారావుపేట, జగిత్యాల, ఆదిలాబాద్, సంగారెడ్డి వ్యవసాయ కాలేజీల విద్యార్థులు పాల్గొన్నారు.